వరంగల్, ఫిబ్రవరి 8: మహానగరపాలక సంస్థ 2023-24 బడ్జెట్ను ఆమోదయోగ్యంగా రూపొందించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులకు సూచించారు. బుధవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి బల్దియా బడ్జెట్ 2023-24పై సన్నాహక సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల ఉన్నతాదికారులు నివేదించే పద్దులపై చర్చించారు. రాబడి, ఖర్చులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేయాలన్నారు.
త్వరలో కౌన్సిల్ ముందు వచ్చే బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ రవీందర్యాదవ్, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, జోనా, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, అకౌంట్స్ అధికారి సరిత, డీఎఫ్వో శంకర్లింగం, బయాలాజిస్ట్ మాధవరెడ్డి, వెటర్నటీ అధికారి డాక్టర్ గోపాల్రావు పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
వడ్డేపల్లి రైల్వేట్రాక్ వద్ద చేపట్టిన బటర్ఫ్లై వాల్వ్ బిగింపు పనును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. ధర్మసాగర్ 2100 ఎంఎం డయా పైపులైన్పై ఏర్పాటు చేస్తున్న బటర్ఫ్లై వాల్వ్ బిగింపు పనులను బుధవారం రాత్రి ఆమె పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేసి, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనాథ్రెడ్డి, బల్దియా డీఈ సంతోష్బాబు, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు.