గిర్మాజీపేట, అక్టోబర్ 25 : కుష్ఠు వ్యాధికి ప్రభుత్వం అధునాతన మందులు అందిస్తున్నదని అడిషనల్ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో వెంకటరమణ అధ్యక్షతన కుష్ఠువ్యాధిపై నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత అడిషనల్ డైరెక్టర్ను డీఎంహెచ్వో సన్మానించారు. అనంతరం రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. శరీరంపై ఒకటి లేదా ఎక్కువ సంఖ్యలో రాగి రంగులో మచ్చలు రావడం, స్పర్శ లేపోవడం, వెంట్రుకలు రాలిపోవడం, అలసటగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి వైద్య పరీక్షలు చేసి తీవ్రతను బట్టి మందులు ఇవ్వాలన్నారు.
ముఖ్యంగా లెప్రసీ రెండు రకాలుగా ఉంటుందని.. ఒక నరానికి సంబంధించిన వ్యాధిని పీబీగా గుర్తిస్తారని, ఈ వ్యాధి సోకిన వారు ఆరునెలలు మందులు వాడాలన్నారు. రెండు నరాలకు సోకిన వ్యాధిని మల్టీ బ్యాచిలెరి (ఎంబీ) కేసులుగా గుర్తిస్తారని, ఏడాది కోర్సు మందులు వాడాలన్నారు. డీఎంహెచ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 8 పీబీ కేసులు, 31 ఎంబీ కేసులు నమోదయ్యాయని, వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలోని ఆరోగ్య కార్యకర్త, సిబ్బంది రాగి రంగులో మచ్చలు ఉన్న వ్యక్తులను గుర్తించి వైద్య పరీక్షలు చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లో చైతన్యం నింపి లెప్రసీని నిర్మూలించడంలో సహకరించాలని డీఎంహెచ్వో కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్, డాక్టర్ శ్రీధర్, నర్సింహారెడ్డి, డీపీఎంవో అనుపమ, లెప్రసీ నోడల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.