వరంగల్, ఫిబ్రవరి 1 : విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. గురువారం పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 37వ డివిజన్ పరిధిలోని కోట గండి, పెరుకవాడ, హనుమకొండలోని ఉజిలి బేస్, మచిలీబజార్లో పర్యటించిన ఆయన సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు. తాగునీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికుల హాజరుపట్టికను పరిశీలించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులు విధులకు రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేయగా, కార్మికులను వెంటనే తొలగించాలని కమిషనర్ సీఎంహెచ్వోను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఉదయం 5 గంటలకే విధుల్లో ఉండాలన్నారు. కార్మికులు, అధికారులు సమయపాలన పాటించాలన్నారు. పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్వో రాజేశ్, ఈఈ శ్రీనివాస్, డీఈ రవికిరణ్, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, నరేందర్, ఏఈలు ముజామిల్, హబీబ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నిరంజన్, ఉపేందర్, అనిల్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : గ్రేటర్ 37వ డివిజన్ తూర్పుకోట కొత్తగడ్డలో గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్బాషా పర్యటించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. తాగునీటి ఇబ్బందులున్నాయని స్థానికులు చెప్పడంతో ఆయన మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడారు. నీరు వృథా కాకుండా సరఫరాలో సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వరంగల్ : హనుమకొండలోని రెడ్డికాలనీలో అనధికార నిర్మాణాలను బల్దియా సిబ్బంది తొలగించారు. గురువారం బల్దియా టౌన్ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో డీఆర్ఎఫ్ బృందాలు రేకుల షెడ్, కాంపౌండ్ వాల్ను కూల్చివేశాయి. అనధికారిక భవనాలను కూల్చివేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిటీ ప్లానర్ వెంకన్న హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ ఖలీల్ పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా నడిబోడ్డున రోడ్డును అక్రమించి నిర్మించిన ఓ షాపింగ్ మాల్ యాజమాన్యానికి కోర్టులో చుక్కెదురైంది. బల్దియా చేపట్టిన కూల్చివేతలు, షాపింగ్ మాల్ సీజ్ చర్యలను న్యాయస్థానం సమర్థించింది. షాపింగ్ మాల్ సీజ్ ఆర్డర్ను రద్దు చేయాలని యాజమాన్యం చేసిన అప్పీల్ను హైకోర్టు తిరస్కరించింది. సిల్ట్ ప్లస్ త్రీ ఫ్లోర్ అనుమతులు తీసుకొని అదనంగా సెల్లార్ నిర్మించినందుకు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బల్దియా చేపట్టిన కూల్చివేతలను సమర్థించి కేసును డిస్మిస్ చేసింది.