వరంగల్, ఫిబ్రవరి 21: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారి లే అవుట్లు, నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఆమె టౌన్ప్లానింగ్ అధికారులతో అనధికార లే అవుట్లు, నిర్మాణాలపై సమీక్షించారు. నగర ప్రజలు సులువుగా, పారదర్శకంగా భవన నిర్మాణాల అనుమతులు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీపాస్ విధానం అమలు చేస్తున్నదన్నారు. టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనధికార లే అవుట్లు, నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బల్దియా ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అనధికార లే అవుట్లు జరుగకుండా చైన్మెన్, టీపీబీవోలు తమ పరిధిలోని డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. అనుమతులు లేని లే అవుట్లు, బఫర్ జోన్లలో నిర్మాణాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి ప్రారంభ దశలోనే తొలగించాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత టౌన్ప్లానింగ్ అధికారులపై ఉందన్నారు. అనధికార లే ఔఅవుట్లపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ వెంకన్న, ఏసీపీలు శ్రీనివాసరావు, శ్రీనివాస్, బషీర్, సుష్మ, టీపీఎస్ల శ్రీకాంత్, అనిల్కుమార్, తేజస్విని, వెంకటరమణ, సంధ్య, టీపీబీవోలు నరేందర్, కావ్వ, రాజు, తేజస్విని పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. డివిజన్ల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్లో పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్, సీఎంఏ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తదితర నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఇంజినీర్లను ఆదేశించారు. టెండర్ దశలో ఉన్న వాటికి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లు చేయని పనులను రద్దు చేయాలన్నారు. వెంటనే కొత్త టెంటర్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. సమీక్షలో ఎస్ఈ కృష్ణారావు, డీఈలు రవికుమార్, నరేందర్, సంతోష్బాబు, రవికిరణ్, సారంగం, ఏఈలు పాల్గొన్నారు.