పోచమ్మమైదాన్, మే 4: అసలే వేసవికాలం.. అధిక ఉష్ణోగ్రతలు.. ఆపై భరించలేని ఉక్కపోత.. పెద్దలు సైతం తట్టుకోలేని ఎండవేడిమి.. ఇక పసికందుల బాధ చెప్పనక్కర్లేదు. దీంతో వార్డుల్లోని చిన్నారులు ఫ్యాన్ల వేడి గాలిని ఎలా తట్టుకుంటారో ఊహించలేం. ఇది వరంగల్ ఎంజీఎం దవాఖానలోని పిల్లల వార్డుల దుస్థితి. ఏసీలు అమర్చినా అలంకారప్రాయంగా ఉండడంతో పసికందులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లల పరిస్థితిని చూసి తల్లులు, అటెండెంట్లు తల్లడిల్లిపోతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉంటాయనే నమ్మకంతో సు దూర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది వైద్యం కోసంవస్తుంటారు. తీరా దవాఖానకు వచ్చిన తర్వాత వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
పేరుకే ఏసీలు
నెలలు నిండకుండానే జన్మించిన పసికందులకు ఎంజీంలోని పీడియాట్రిక్ యూనిట్ ఐసీయూ/హెచ్డీయూ వార్డుల్లో చికిత్స అందిస్తుంటారు. వీరి కోసం రెండు వార్డుల్లో కలిపి నాలుగు చొప్పున ఎనిమిది ఏసీలు అమర్చారు. ప్రస్తుతం అవి పని చేయడం లేదు. ఓ వైపు ఎండల వల్ల ఉష్ణోగ్రత స్థాయి పెరిగి పసికందులు తల్లడిల్లుతున్నారు. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, ఉక్కపోత భరించలేక ఉసూరుమంటున్నామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల వ్యాధులను నయం చేసుకుందామని ఎంతోదూరం నుంచి వస్తే ఇక్కడ తాము నరకం చూడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏసీలు పెట్టి ఏం లాభం?
పసికందులు చికిత్స పొందుతున్న వార్డుల్లో ఏసీలు పెట్టి ఏం లాభం. వేడి భరించలేక ఉక్కపోత, చెమటతో ఇబ్బందులు పడుతున్నం. ఇక మా చిన్నారులు ఎలా భరిస్తారు. పని చేయని ఏసీలను వార్డులో ఎందుకు పెట్టారు. నేను ఈ దవాఖానకు వచ్చి నెల పదిహేను రోజులు అవుతోంది. పొద్దున్నుంచి రాత్రి వరకూ వేడి భరించలేకపోతున్నం.
– వినోద, మహబూబాబాద్