Vote | ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కొత్తగా మరో షెడ్యూల్ను ప్రకటించింది. తద్వారా ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. కొత్త ఓటరు(1 అక్టోబర్, 2023వరకు 18 ఏళ్లు నిండిన వారు) నమోదుతో పాటు ఇతర మార్పులు, చేర్పులకు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 25 నుంచే ఇంటింటా మొదలైన బీఎల్వోల సర్వే జూన్ 23వరకు కొనసాగనుండగా డబుల్, చనిపోయిన ఓటర్లను తొలగించి సవరణల తర్వాత అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.
– హనుమకొండ,
ఎన్నికల సంఘం ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ఎస్ఆర్) ద్వారా ఓటరు జాబితా సవరిస్తుంది. ఇందులో భాగంగా నవంబర్ నెలలో ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించి జనవరి 5న తుది జాబితాను విడుదల చేస్తుంది. కానీ ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడం వల్ల రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనున్నది. ఇందులో భాగంగా ఇంటింటా సర్వేతో పాటు అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించి ఓటరు జాబితాలో సవరణలు చేసి తుది జాబితాను ప్రకటిస్తారు.
ఈ నెల 25 నుంచి జూన్ 23 వరకు బీఎల్వోలు ఇంటింటా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయిస్తారు. అదే విధంగా రెండు ఓట్లు ఉన్నవారిని, చనిపోయిన వారిని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి వారిని తొలగించి ఓటరు జాబితాలో సవరణలు ఉంటే చేసే విధంగా ఓటర్లు అవగాహన కల్పిస్తారు.
జూన్ 24నుంచి జూలై 24వరకు పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. వాటిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో పరిశీలించడంతో పాటు ఓటరు జాబితా మార్పులు, చేర్పులకు అనుగుణంగా ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటారు. పాత పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులుంటే కొత్త కేంద్రాలను గుర్తిస్తారు. అవసరమైతే పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించి ఎన్నికల సంఘానికి పంపిస్తారు.
రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా అక్టోబర్ 4వ తేదీన తుది ఓటరు జాబితాను వెల్లడిస్తారు. జూలై 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తారు. ఆగస్టు 2వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఆగస్టు 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మధ్యకాలంలో నూతన ఓటరు నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులపై రెండు శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 22న అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.