కురవి, నవంబర్ 9 : కందగిరి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి జాతర బుధవారం వైభవంగా జరిగింది. అశేష భక్తజన ప్రవాహంతో భక్తజనగిరిగా మారింది. తెల్లవారుజామున నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ యువజన నేత డీఎస్ రవిచంద్రతో కలిసి గుట్ట దిగువ భాగాన పూజలు నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మనసారా వేడుకున్నారు. అనంతరం జాతరలో మిఠాయిలు కొని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఆర్డీవో కొమురయ్య, ఎంపీడీవో సరస్వతి, కురవి, సీరోలు తహసీల్దార్లు ఇమ్మాన్యూయేల్, విజయ్కుమార్ పనులను పర్యవేక్షించారు. ఎస్పీ శరత్చంద్రపవార్ స్వయంగా గుట్ట వద్దకు చేరుకుని బందోబస్తును పర్యవేక్షించారు. తొర్రూరు డీఎస్పీ రఘు సారథ్యంలో మరిపెడ సీఐ సాగర్ నేతృత్వంలో 120మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జరిగే జాతరలో గుట్ట గోవింద నామస్మరణతో మార్మోగింది. పట్టుతప్పితే ప్రాణసంకటంగా ఉన్న దారుల వెంట భక్తులు అలుపూసొలుపు లేకుండా లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. భక్తులు తిరుగు ప్రయాణంలో కోనేటిలో దొరికే సీతజడ ఆకులను ఇంటికి తీసుకెళ్లారు. అర్చక స్వాములు పల్లాప్రోల్ పురుషోత్తమాచార్యులు, నర్సింహాచార్యులు, శ్రీకాంతాచార్యులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు.
అఖండ దీపం.. దేదీప్యమానం
శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం అనంతరం రాత్రి పర్వత శిఖరంపై అఖండదీపాన్ని(జ్యోతి) కందికొండ గ్రామానికి చెందిన శాలివాహన కులస్తులు, పూజారులు కలిసి వెలిగించారు. ఈ అఖండ జ్యోతి దర్శనం జిల్లావ్యాప్తంగా అధిక భాగం కనిపిస్తుంది. గుట్ట ఎక్కలేని వయస్సు వారు దీపాన్ని చూసి తరించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందజేశారు. డీఎంహెచ్ఓ సారథ్యంలో పీహెచ్సీ వైద్యులు గోపి, పృథ్వీలతోపాటు వైద్యులు ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు నాలుగు హెల్త్క్యాంపుల ద్వారా సేవలందించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జాతరకు వచ్చిన భక్తులకు పులిహోర అందజేశారు. కార్యక్రమంలో జంగాల నర్సింహారావు, భాస్కరరావు, మంగపతిరావు, డాక్టర్ సునీల్, శ్రీధర్, ప్రతాపని శ్రీధర్, జెవీ గ్రాఫిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్, కలెక్టర్ శశాంక సూచన మేరకు గుట్ట దిగువన పార్కింగ్తో పాటు అడుగడుగునా పోలీస్ సిబ్బందిని కేటాయించడంతో అందరికీ సౌలభ్యంగా మారింది. గతంలో పార్కింగ్ దూరంగా ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలిగేది. అలాగే వన్వే ఏర్పాటు వల్ల ఎక్కడ రద్దీ కనిపించడలేదు. పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్యంపై నిఘా పెట్టడంతో జాతర సజావుగా సాగింది.