వరంగల్, మార్చి 16 : నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే ఆలోచనలతో గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణంపై బల్ది యా చేతులెత్తేసింది. నిధుల లేమితో పనులు పూర్తి చేయడం తమ వల్ల కాదని తేల్చి చెప్పిం ది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ లక్ష్మీపురం, హనుమకొండ ఐబీ గెస్ట్హౌస్ ప్రాంగణంలో వెజ్, నాన్వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ మార్కె ట్, మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, సగం పనులు పూర్తి చేసింది. రూ. 24 కోట్ల అంచనాలతో లక్ష్మీపురం, రూ.9 కోట్లతో ఐబీ గెస్ట్హౌస్ ప్రాంగణంలో మార్కెట్లకు ప్రణాళికలు చేశారు. తొలి విడతలో ఒక్కో మార్కెట్కు రూ.4.5 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ నిధులతో ప్రారంభమైన పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో వీటి నిర్మాణాలకు నయా పైసా విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా పనులకు నిధులు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక కార్పొరేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఏఎంసీకి పనులు అప్పగించే యత్నం
వరంగల్ లక్ష్మీపురంలో నిలిచిపోయిన మార్కెట్ పనులు పూర్తి చేసే బాధ్యతను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అప్పగించేందుకు బల్దియా ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఇటీవల ఏఎంసీ అధికారులకు బల్దియా అధికారులు లేఖ రాశారు. రూ. కోట్ల నిధులతో ముడిపడి ఉన్న ఈ పనులను పూర్తి చేసే బాధ్యతలు చేపట్టేందుకు మార్కెట్ అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. దీనిపై మార్కెట్ పాలకవర్గ సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది రోజుల్లో అటో.. ఇటో తేలనున్నది.
అంచనాలు రెట్టింపయ్యే అవకాశం
లక్ష్మీపురంలో నాలుగేళ్ల కిత్రం రూ. 24 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెట్ మార్కెట్ నిర్మాణ అంచనాలు రెట్టింపయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. గత ప్రభుత్వం సీఎంఏ, పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్ నిధులు సుమారు రూ.10 కోట్లతో ప్రారంభించి రెండేళ్ల కిత్రం వరకు కొన్ని పనులు పూర్తి చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి నయా పైసా విడుదల చేయకపోవడంలో పనులు నిలిచిపోయాయి. ఈ విషయంపై బల్దియా అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వానికి లేఖ రాశామని, నిధులు వస్తే పనులు చేస్తామంటున్నారు. కాగా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. లక్ష్మీపురం మార్కెట్లో స్లాబ్లు, గోడల నిర్మాణం పూర్తయ్యాయని మరి కొన్ని పిల్లర్ల స్థాయిలో ఉన్నాయని, హనుమకొండలో మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు పూర్తయ్యిందని, రెండేళ్లుగా ఆయా నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని నగర ప్రజలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక దృష్టిసారించి నిధులు విడుదల చేసి మార్కెట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.