సుబేదారి, ఏప్రిల్ 27: మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం లొంగిపోయారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా (పూర్వ గుంటూరు జిల్లా).మాచర్ల మండలం కంబంపాడుకు చెందిన కాసరనేని రవికుమార్ ఆలియాస్ అజిత్, ఆలియస్ మున్నా, ఆలియాస్ సుర్యా అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యుడిగా, మణుగూరు ఎల్వోఎస్ కమాండర్గా పనిచేస్తున్నారు. చర్ల మండలం బత్తినిపల్లికి చెందిన మడివి సోమిడి ఆలియాస్ కల్పన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -పాల్వంచ ఏరియా కమిటీ సభ్యురాలిగా, మణుగూరు ఎల్వోసీ డిప్యూటీ కమాండర్గా పనిచేస్తున్నది. కంబంపాడుకు చెందిన రవికుమార్ ఇంటర్ ఫస్టియర్ను మధ్యలోనే ఆపేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తమ బంధువుల ఇంట్లో కొన్నేళ్లున్నాడు. ఇదే సమయంలో రవికుమార్ 2012లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లో చేరాడు.
కొద్ది రోజులకు కొత్తగూడెం కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎంపికై ఆతర్వాత పీడీఎస్యూలో చేరాడు. రవికుమార్ చురుగ్గా పనిచేయడంతో అతడిని కొత్తగూడెం పట్టణ విభాగానికి అధ్యక్షుడిగా, ఖమ్మం జిల్లా సభ్యుడిగా, నియమించారు. 2016లో మావోయిస్టుల సిద్ధాంతాలకు ఆకర్షితుడైన రవికుమార్ తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ పోత్సాహంతో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరి చర్ల ఏరియా కమాండర్ సోడి జోగయ్య నాయకత్వంలో పనిచేశాడు. 2017లో డిప్యూటీ కమాండర్ గా పనిచేసిన రవికుమార్ 2019లో మావోయిస్టు పార్టీ మణుగూరు ఎల్ఓఎస్ ఏసీఎం అయిన మడవి సోమిడి అలియాస్ కల్పనను వివాహం చేసుకున్నాడు. 2021 నుంచి వీరు భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్లలో మణుగూరు, పాల్వంచ, ఏరియా కమిటీ సభ్యుడిగా, మణుగూరు ఎల్ఓఎస్ కమాండర్గా, 2022లో కోఆప్షన్ డివిజనల్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ఇతడిపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది. కల్పన 2017లో మావోయిస్టు పార్టీలో చేరింది. 2018లో చర్ల ఎల్ఓఎస్ సభ్యురాలిగా. 2020లో ఏసీఎం, మణుగూరు ఎల్వోఎస్ డిప్యూటీ క మాండర్గా పనిచేసింది. ఈమెపై రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డు ప్రకటించింది.
లొంగిపోతే పునరావాసం కల్పిస్తాం : సీపీ
మావోయిస్టు పార్టీ సిద్దాంతాలు నచ్చకపోవడం, పార్టీపై ప్రజల్లో ఆదరణ సన్నగిల్లడం, ఆనారోగ్య సమస్యలతో కీలక నాయకులు లొంగిపోతున్నారని సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. లొంగిపోయిన రవికుమార్, సోమిడి దంపతులకు ప్రభుత్వం నుంచి రివార్డులు, పునరావాసం అందిస్తామన్నారు. మావోయిస్టు పార్టీలోని వారు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పునరావసం కల్పిస్తామని సూచించారు.