వరంగల్, ఆగస్టు 30(నమస్తేతెలంగాణ) : జిల్లాలోని అన్ని పాఠశాలల్లో బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో, ఎంపీడీవో సోమవారం ధ్రువీకరిస్తూ కలెక్టర్కు నివేదిక పంపారు. పాఠశాలల పరిశుభ్రతపై డీఈవో వాసంతి జిల్లాలోని ఎంఈవోలు, హెచ్ఎంలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం వం ట గదులను సిద్ధం చేయడం, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలపై మట్లాడారు. మంగళవారంలోగా ఆయా ప్రభుత్వ పాఠశాలలోని వంట గదిలో మధ్యాహ్న భోజనం తయారు ట్రయల్ నిర్వహించాలని, నిల్వ ఉన్న బియ్యం, నిత్యావసర సరుకులను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రారం భం రోజు నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా విద్యార్థులు తమ వెంట బాటిళ్లలో వాటర్ తెచ్చుకోవడానికి అనుమతించాలని చెప్పారు.
నిబంధనల అమలుకు కమిటీలు..
ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 724 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. వీటిలో 10 కేజీబీవీలు, 6 మోడల్ పాఠశాలలు, మిగత 708 స్కూళ్లలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 46,524 మంది విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు. గత ఫిబ్రవరి, మార్చిలో దశల వారీగా 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. ఆ తర్వాత కరోనాతో పాఠశాలలు మూతపడడంతో ఫిబ్రవరి, మార్చిలో పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం, నిత్యావసర సరుకులు అలాగే ఉండిపోయాయి. వీటిని పరిశీలించి ఇంకా అవసరమైన బియ్యం, నిత్యావసరాలను విద్యాశాఖ అధికారులు రెండు రోజుల నుంచి సమకూర్చుతున్నారు. రోజుకు ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఒక్కొకరికి 100 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఒక్కొకరికి 150 గ్రాముల బియ్యం చొప్పున కేటాయింపులు జరుపుతున్నారు. సోమవారం వరకు సుమారు 100 పాఠశాలలకు బియ్యం సరఫరా చేసినట్లు డీఈవో వెల్లడించారు. కరోనా నిబంధనలను ఆయా పాఠశాలలోని ఉపాధ్యాయులు, వర్కర్లు, విద్యార్థులందరూ తప్పకుండా పాటించాల్సి ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి కచ్చితంగా మాస్కు ధరించాలని, భోజన సమయంలో, తాగునీరు, టాయిలెట్ల వద్ద గుంపులుగా ఉండవద్దని సూచించారు. ఈ నిబంధనల అమలుకు ఆయా పాఠశాలలోని ఉపాధ్యాయులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు లేదా శానిటైజర్ అందుబాటులో ఉంటుందని, థర్మల్ స్కానర్ కూడా సమకూర్చుతామని డీఈవో తెలిపారు.