చేర్యాల, జనవరి 22 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి పట్నం వారం సందర్భంగా ఆదివారం 50వేల మంది భక్తులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్న భక్తులు, ఆదివారం వేకువజాము నుంచే స్వామి దర్శనానికి వెళ్లారు. ఆలయంలో వేద పండితులు, అర్చకులు స్వామివారికి నిత్య కల్యాణ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. పలు ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఆలయ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ధర్మకర్తలు కొంగిరి గిరిధర్, సూటిపల్లి బుచ్చిరెడ్డి, నర్ర రఘువీరారెడ్డి, కందుకూరి సిద్దిలింగం, పచ్చిమడ్ల సిద్దిరాములు, మహేశ్ యాదవ్, సాయి యాదవ్, చెట్కూరి తిరుపతి, కాసర్ల కనకరాజు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ అధ్వర్వంలో చేర్యాల సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో జిల్లాలోని వివిధ స్టేషన్ల సీఐలు, కొమురవెల్లి, చేర్యాల, కోహెడ ఎస్సైలు
చంద్రమోహన్, భాస్కర్రెడ్డి, నరేందర్, పలువురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.
మహా ముఖ మండపం, గంగరేగు చెట్టు, అద్దె గదుల ప్రాంగణాలు పట్నాలతో కళకళలాడాయి. భక్తులు అద్దె గదుల ముంగిట చిలుక పట్నం, గంగరేగు చెట్టు వద్ద నజరు పట్నం, మహా మండపంలో ముఖ మండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు స్వామివారి కల్యాణ సేవలో పాల్గొన్నారు. మరికొందరు అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించారు. అర్చన, అభిషేకాది పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి పట్నాలు వేశారు. ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. బోనం వండి పట్నంపై నిలిపారు. మరికొందరు కొండపైకి బోనం తీసుకువెళ్లి ఎల్లమ్మకు సమర్పించి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు.
మల్లన్న ఆలయవర్గాల సహకారంతో హైదరాబాద్ ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదీ భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణ వేదిక వద్ద సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం తయారు చేయనున్నారు. స్వామి వారి పట్నం వారానికి వచ్చిన భక్తులు పెద్ద పట్నం, అగ్నిగుండం దాటి స్వామి వారిని మరోసారి దర్శించుకుంటారు. అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సిద్దిపేట, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, జనగామ తదితర జిల్లాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. పట్నం వారం సందర్భంగా ప్రధాన రహదారులన్నీ కొమురవెల్లి వైపే సాగాయి. హైదరాబాద్, సిద్దిపేట, చేర్యాల, కొమురవెల్లి రహదారుల్లో రెండు కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు.
కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజామునే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ధర్మ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, శీఘ్ర దర్శనానికి 2గంటల సమయం పట్టింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దర్శనాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు వేసి, క్యూలైన్లలో తాగునీటి వసతి కల్పించారు. భక్తులకు అన్నదానం చేశారు. తీర్థ ప్రసాదాలు అందుబాటులో ఉంచారు.