సుబేదారి, ఫిబ్రవరి 13: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ లేని 348 వాహనాలను సీజ్ చేసి, వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ సోమవారం విలేకరులకు తెలిపారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట పట్టణాల్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో రిజిస్ట్రేషన్లు లేని, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, నంబర్ప్లేట్కు మాస్కులు పెట్టి డ్రైవ్ చేస్తున్న 348 వాహనాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో వాహన యజమానులపై చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు మధుసూదన్ పేర్కొన్నారు. వీటిలో నాలుగు కార్లు, ఆటో, 343 ద్విచక్రవాహనాలను సీజ్ చేశామని తెలిపారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో 93, హనుమకొండ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో 126, కాజీపేట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో 72 వాహనాల ను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. తనిఖీల్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బాబులాల్, రామకృష్ణ, రవికుమార్, ఎస్సైలు రాజబాబు, డేవిడ్, సాంబయ్య పాల్గొన్నారు.
రాత్రి లౌడ్ స్పీకర్లు వాడితే కఠిన చర్యలు : సీపీ
సుబేదారి : రాత్రి వేళల్లో లౌడ్ స్పీకర్లు, వాయిద్యాలు(బ్యాండ్) వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొందరు వ్యక్తులు, సంస్థలు సమయపాలన పాటించకుండా లౌడ్ స్పీకర్లు, వాయిద్యాలు ఉపయోగిస్తున్నారని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 గంటల ముందు, రాత్రి 10 గంటల తర్వాత డీజే సౌండ్స్, వాయిద్యాలు ఉపయోగించొద్దని సూచించారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే లౌడ్ స్పీకర్లు, వాయిద్యాలు వినియోగించినా, పటాకులు కాల్చి నా డయల్ 100 ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం అం దించాలన్నారు. స్థానిక పోలీ సు అధికారి చర్యలు తీసుకోకుంటే 8712685100 ఫోన్ నంబర్కు సంక్షిప్తంగా మెసేజ్ చేయాలని సీపీ సూచించారు.