న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 17 వరకూ మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు నాలుగు రెట్లు పెరిగి 4739 టన్నులకు ఎగబాకాయని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ కొరత పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. దవాఖానలకు ఆక్సిజన్ సరఫరాలను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు.
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలకు భారతీయ రైల్వేలు మరికొద్ది రోజుల్లో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనున్నాయి. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతించిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే మంజూరైన 162 ప్లాంట్లకు తోడు మరో 100 ఈ తరహా ఆక్సిజన్ ప్లాంట్లను కూడా మంజూరు చేయాలని రాష్ట్రాలు కోరగా కేంద్రం సమ్మతించింది. కొవిడ్ సెకండ్ వేవ్ లో గతంతో పోలిస్తే రోగులకు ఆక్సిజన్ వాడకం పెరిగిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పేర్కొన్నారు.