కొవిడ్ను దూరం పెట్టేందుకు.. తొలి లాక్డౌన్ విధించి సంవత్సరం అవుతున్నది. ఇప్పటికీ ఆ మహమ్మారి చాటుమాటు నుంచీ దాడి చేస్తూనే ఉంది. కాకపోతే, హైదరాబాద్లో చాలామందికి కొవిడ్ వచ్చి తగ్గిపోయిందనీ, వాళ్లలో యాంటీబాడీస్ తయారయ్యాయనీ తెలియడం కాస్త ఊరట కలిగించే విషయమే. భాగ్యనగరంలోని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి మరికొన్ని వాస్తవాలను వెల్లడించారు. వీరి అధ్యయనం ప్రకారం కుటుంబంలో ఎవరో ఒకరికి కొవిడ్ వచ్చి తగ్గితే కనుక, మిగతా సభ్యులలో యాంటీబాడీస్ రూపొందిన పరిస్థితులు 78 శాతం వరకూ కనిపించాయి. ఓ కుటుంబంలో ఎవరో ఒకరు కలుసుకున్న వ్యక్తికి కొవిడ్ వస్తే, ఇతని ఇంట్లో కొవిడ్ యాంటీబాడీస్ ఉత్పత్తి అయిన శాతం 68! కాస్త చిన్నపాటి ఇండ్లలో ఉండేవారికీ, ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్నవారికి పుష్కలంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అయిన సందర్భాలు ఎక్కువగా కనిపించాయి. మనుషుల మధ్య పెద్దగా ఎడం లేకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. ఏదేమైనా, ఉమ్మడి కుటుంబాల వల్ల లాభాల్లో ఈ యాంటీబాడీస్ కూడా ఒకటని భావించవచ్చు.