శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్లతో మార్మోగిన ఆలయం
నేడు మకర సంక్రాంతి సందర్భంగా మహానివేదన
ఐనవోలు, జనవరి 14: ‘ఐనవోలు మల్లన్నా.. శత కోటి దండాలు’.. ‘కోరిన కోర్కెలు తీర్చి మమ్మేలు మా తండ్రికి శతకోటి దండాలు..’ కోరికలు నెరవేరితే కోడెలు కడుతం’.. ‘పాడి పంటలు పండి పిల్లా జెల్లా సల్లంగ ఉంటే పట్నాలు వేస్తం.. ‘గండాలు తీరితే గండ దీపం పెడుతం’.. ‘అందరం సల్లంగుంటే శావ తీస్తం’.. అంటూ భక్తజనం వేడుకున్నది. హనుమకొండ జిల్లా ఐనవోలులో మల్లికార్జున స్వామి జాతర శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభం కాగా, తొలి రోజు పట్నాలు, బోనాలతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. శివసత్తుల పూనకాలు.. డప్పుల మోతలు.. ఢమరుక నాదాలతో ఆలయం మార్మోగింది. ఈ ఏడాది భోగి పండుగకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుంచే తాకిడి పెరగడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. మహిళల పూనకాలతో మల్లికార్జునస్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పడమ ర వైపు ఉన్న ఎల్లమ్మ గుడిలో బోనాలు సమర్పించారు.
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు..
ఐనవోలు మల్లన్నను గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కవితాకుమారి దంపతులు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, ఐనవోలు ఎంపీపీ మార్నేని మధుమతి, ధర్మసాగర్ ఎంపీపీ కవిత, వేలేరు జడ్పీటీసీ చాడా సరిత, సునీత, వర్ధన్నపేట సోషల్ మీడియా ఇన్చార్జి అరూరి విశాల్ తదితరులు దర్శించుకున్నారు. వారితోపాటు జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, డైరెక్టర్ మునిగాల సంపత్కుమార్, సీఐ విశ్వేశ్వర్, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, ఎస్సై భరత్, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, స్థానిక సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఉప సర్పంచ్ సతీశ్కుమార్ తదితరులు ఉన్నారు.
నేడు బండ్ల ప్రదక్షిణ
శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, మహా నివేదన, తీర్థ ప్రసాద వితరణ, రాత్రి వేళ మార్నేని వంశీయుల పెద్ద బండి, ప్రభల బండ్ల ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది.