పాలకుర్తి, జూన్ 26: మహాకవులు పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన నడయాడిన నేల పాలకుర్తి అని, తెలంగాణ సాయుధ పోరాటానికి నిలయమైన ఈ ప్రాం తం ఓ పుణ్యభూమి అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సాహితీరంగానికి పేరెన్నికగల పాలకుర్తి అంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమని, అందుకే ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో సాహితీరంగంలో సేవలందిస్తున్న వారికి ఆదివారం మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి ఆలయ కల్యాణ మండపంలో పురస్కారాలను ప్రదానం చేశారు. కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. వీరశైవం ప్రాతిపదికగా కులరహిత సమా జం కోసం నాడు సోమనాథుడు తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపర్చారని తెలిపారు.
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాహితీరంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన వివరించారు. పాలకుర్తిలో సోమనాథుడి కల్యాణ మండపానికి రూ.10 కోట్లు, బమ్మెరలో మహాకవి పోతన స్మారక మందిరానికి రూ.7.5 కోట్లు, వాల్మికి జన్మస్థలమైన వల్మిడిలో పర్యాటకరంగ పనులకు రూ.5 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నుంచి తాను శాసనసభ్యుడిగా ఎన్నికవడం తన అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం సోమనాథ సాహిత్య పురస్కారాన్ని ప్రొఫెసర్ మఠం లింగయ్యస్వామికు అందించారు. సోమనాథ సామాజిక పరిశోధనా పురస్కారాన్ని దండి వెంకట్కు, సోమనాథ రంగస్థల పురస్కారాన్ని తడకమళ్ల రామచంద్రరావుకు, పందిళ్ల శేఖర్బాబు, రాజయ్యశాస్త్రి స్వచ్ఛంద భాషా సేవా పురస్కారాన్ని సత్తి సునీల్రెడ్డి, వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారాన్ని డాక్టర్ చింతకాయల ఆంజనేయులు, మొశం దామోదర్రావు ప్రాచీన చరిత్ర వైజ్జానిక పరిశోధన పురస్కారాన్ని వేదవీర్ ఆర్య, రాపోలు సోమయ్య ప్రతిభా పురస్కారాన్ని చిలకమారి రాజేశ్, సరస్వతి సంఘసేవక బిరుదుల గ్రహీతలు వేముల శ్రీవేమన, శ్రీచరణ్సాయిదాస్, లింగంపల్లి రామచంద్ర, జగదీశ్కు మంత్రి అవార్డులందించారు.