చెన్నారావుపేట, అక్టోబర్ 26: మండలంలో పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), అక్షయ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉపకరణాల అద్దె కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, మొదటి సంవత్సరంలోనే రూ. 8.46 లక్షల టర్నోవర్తో రూ. 5.15 లక్షల లాభాలు పొందడం అభినందనీయమని అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్(ఏపీడీ) గొట్టె శ్రీనివాసరావు అన్నారు. ఆదాయం పొందిన జాబితా లో రాష్ట్రంలోనే మండలం ప్రథమ స్థానంలో నిలువడం ఆనందంగా ఉందన్నారు. మండలకేంద్రంలో సోమవారం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎఫ్పీవో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే యోచన ఉందని, దీనికి ఎఫ్పీవో సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మండల ప్రాజెక్టు డైరెక్టర్ ముక్కెర ఈశ్వరయ్య మాట్లాడుతూ మండలంలో స్వయం ఉపాధి పొందాలనుకునే వారి కోసం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశామని, దీనికోసం సంబంధిత సీసీలు, వీవోలను సంప్రదిస్తే ఆర్థిక వనరులు, శిక్షణ ఇస్తారన్నారు. ఇన్చార్జి డీపీఎం సుధాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహిస్తున్న పిండిమరల ఆధునీకరణకు గతంలో ఏర్పాటు చేసిన చిన్న పరిశ్రమలను విస్తృతపర్చడం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నెక్కొండ మండల ఏపీఎం శ్రీనివాస్, అక్షయ అధ్యక్షురాలు చిర్ర సృజన, తిరుమల, భాగ్య, ప్రమీల, చిన్ని, కమ్యూనిటీ కో ఆర్డినేటర్ కట్టయ్య, వెంకటేశ్వర్లు, సుజాత, మంజుల, రజిత, ఉమ, సురేశ్, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల డైరెక్టర్లు పాల్గొన్నారు.