చెన్నారావుపేట, ఆగస్టు 26: జిల్లాలోని ప్రతి పాఠశాల, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని డీపీవో ప్రభాకర్ సూచించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో జరిగే శానిటేషన్ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. ఇందులో గురువారం ఆయన అమీనాబాద్ యూపీఎస్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఎక్కడా నీరు నిల్వకుండా లెవలింగ్ చేయాలన్నారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పాఠశాలల్లోని ప్రతి గదిని శానిటేషన్ చేయాలన్నారు. విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలలకు చర్యలు చేపట్టాలన్నారు. పిల్లలు భౌతికదూరం పాటించేలా సీటింగ్ అలాట్మెంట్ పక్కాగా ఉండాలన్నారు. పాఠశాల ఆవరణల్లో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సిద్దెన రమేశ్ గ్రామాన్ని మొదటిసారిగా సందర్శించిన డీపీవో ప్రభాకర్ను సన్మానించారు. అనంతరం డీపీవో గ్రామంలోని పారిశుధ్య కార్మికురాలు శాంతను శాలువాతో సత్కరించారు. అలాగే, డీపీవో కోనాపురం శివారులో గల బృహత్ పల్లెప్రకృతి వనం కోసం అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో దయాకర్, ఎంపీవో గౌడ సురేశ్, ఆర్ఐ స్వామి, హెచ్ఎం ఆంగోత్ భద్రయ్య, కోనాపురం సర్పంచ్ వెల్దె సుజాత, అమీనాబాద్, కోనాపురం కార్యదర్శులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాలి..
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఎల్పీవో ప్రభాకర్ సూచించారు. చింతనెక్కొండ ప్రభుత్వ పాఠశాలను ఆయన పరిశీలించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పాఠశాలలను శుభ్రం చేసి, శానిటేషన్ చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యంతోపాటు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ గటిక సుష్మా మహేశ్, ఎంపీవో మధుసూదన్, కార్యదర్శి సరిత, ఉపసర్పంచ్ దేవేందర్ ఉన్నారు. నర్సంపేట పట్టణంలోని స్కూళ్ల ఆవరణల్లో ఉన్న పిచ్చిమొక్కలు తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేశారు. రసాయనాలను పిచికారీ చేశారు. నెక్కొండ మండలంలోని అన్ని పాఠశాలల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. రెడ్లవాడ పాఠశాలలో సర్పంచ్ రావుల శ్రీలతాప్రసాద్, ఎంఈవో రత్నమాల జీపీ సిబ్బంది చేస్తున్న పనులను పర్యవేక్షించారు. నల్లబెల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను శానిటేషన్ చేశారు. సర్పంచ్లు, కార్యదర్శులు, అధికారులు జీపీ సిబ్బందితో పనులు చేయించారు. ఎంపీడీవో విజయ్కుమార్ పర్యవేక్షించారు.
స్కూళ్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి
నర్సంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ మోతె కళావతి సూచించారు. ఇటుకాలపల్లి, రాజపల్లి, ముగ్ధుంపురం, కమ్మపల్లి, గురిజాల, ముత్యాలమ్మతండా, రాజేశ్వర్రావుపల్లి, గుంటూరుపల్లి, చంద్రయ్యపల్లిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీపీ ముగ్ధుంపురం ప్రాథమిక పాఠశాలలో పనులను పరిశీలించారు. అదేవిధంగా ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు, ఎంపీవో అంబటి సునీల్కుమార్రాజ్ పలు పాఠశాలలను సందర్శించారు. పారిశుధ్య పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సంగెం మండలంలోని సర్కారు బడుల్లో పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. గదులను శుభ్రం చేసి గోడలు, బెంచీలు, కుర్చీలపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి పాఠశాలలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది తరగతి గదులను శానిటేషన్ చేశారు. అలాగే, మలేరియా శాఖ సిబ్బంది పాఠశాలతోపాటు ఆవరణ, తరగతి గదుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. వచ్చే నెల ఒకటో తేదీలోగా మరోసారి పారిశుధ్య చర్యలు చేపట్టనున్నట్లు సిబ్బంది తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల పరిశీలన
వచ్చే నెల ఒకటో తేదీన స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీడీవో సుమనావాణి మండలంలోని దబ్బీర్పేట, కీర్యాతండా ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా బడుల్లో ఉన్న మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రతి పాఠశాలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చే నెల 1వ తేదీ వరకు సిద్ధం చేయాలని ఎంపీడీవో సూచించారు. ఉపాధ్యాయులు నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించాలన్నారు. గీసుగొండ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ దౌడు బాబు పారిశుధ్య పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామ పంచాయతీ ద్వారా పాఠశాలలో శానిటేషన్ పనులు చేయిస్తామన్నారు.