గీసుగొండ, మార్చి 7: పోలీస్స్టేషన్లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని శాయంపేటలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గత నెల 28న శాయంపేటలో ఆకుల కుమారస్వామి ఇంట్లో దొంగతనం జరిగి ఆరున్నర తులాల బంగారం అపహరణకు గురైంది. దీనిపై కుమారస్వామి ఈ నెల 1న గీసుగొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పోలం వంశీకృష్ణ(26) పై అనుమానం ఉందని పేర్కొనడంతో ఎస్సై శ్వేత విచారణ చేపట్టారు. వంశీకృష్ణను పోలీస్ స్టేషన్కు పిలిపి నేరం ఒప్పుకోవాలని కేసు కూడా మాఫీ చేస్తామని బెదిరించారని సమాచాం. కుమారస్వామి కొడుకు మనోజ్, వంశీకృష్ణ స్నేహితులు. అయితే దొంగతనం జరిగిన రోజు వంశీకృష్ణ వచ్చాడని వారు చెప్పడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ పేరుతో రోజూ స్టేషన్కు పిలిచి తమదైన శైలిలో వ్యవహరించారు.
ఎస్సై శ్వేత సోమవారం విచారణ కోసం వంశీకృష్ణను స్టేషన్కు పిలిపించగా అతడు వచ్చేటప్పుడే మచ్చాపురం వద్ద గడ్డి మందు కొనుగోలు చేసి చిన్న థమ్సప్ బాటిల్లో కలుపుకొని జేబులో పెట్టుకొని స్టేషన్కు వచ్చాడు. ఎస్సై మాట్లాడి లోపల కూర్చోమని చెప్పగా, కొద్ది సేపటికే వెంట తెచ్చుకున్న గడ్డి మందును వంశీవృష్ణ తాగి వాంతులు చేసుకున్నాడు. పోలీసులు గమనించి 108కు సమాచారం అందించారు. మరోవైపు బాధితుడిని పోలీసు వాహనంలో, ఆ తర్వాత 108 ద్వారా ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. చేయని నేరానికి వేధించడం వల్లే దీనిని భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి రాధ ఆరోపించారు. వరంగల్ సీపీ రంగరాథ్ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాగా వంశీకృష్ణ తండ్రి ప్రభాకర్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి రాధ, చెల్లి దివ్యతో కలిసి వంశీకృష్ణ కూలీ పనలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫిర్యాదుదారుడి సోదరుడు దొడ్డ లింగయ్య ఘట్కేసర్లో సీఐడీలో సీఐగా పనిచేస్తున్నాడు.
విచారణ కోసమే స్టేషన్కు పిలిచాం : సీఐ సట్ల రాజు
దొంగతనం కేసులో వంశీకృష్ణను విచారణ కోసమే స్టేషన్కు పిలిచాం. అతన్ని వేధించలేదు. ఫిర్యాధుదారుడి అనుమానం ప్రకారం మాత్రమే అతన్ని పిలిచి విచారించాం. అతడి ఫోన్లో బ్యాంకుల నుంచి డబ్బులు బదిలీ అయినట్లు మెసేజ్లు ఉన్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు పిర్యాధు మేరకు కేసు నమోదు చేస్తాం.
ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
తన కుమారుడిని వేధింపులకు గురించి ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి పొలం రాధ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంగళవారం ఆమె గీసుగొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాధు చేశారు. కూలీ పనులు చేస్తూ జీవిస్తున్న తమకు ఎవరూ ఆసరా లేరన్నారు. తమపై కావాలనే కేసుపెట్టి వేధిస్తున్న వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.