హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 27 : నియోజకవర్గానికో స్టేడియం నిర్మించేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్మించిన సింథటిక్ ట్రాక్ను శుక్రవారం ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ వినయ్భాస్కర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సింథటిక్ ట్రాక్ గురించి మంత్రులకు అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావు వివరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి జిల్లా నాయకులే కారణమని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. 70 ఏళ్లలో ఎవరూ చారిత్రక కట్టడాల గుర్తింపు అంశాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పండుగలు, కట్టడాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. స్పోర్ట్స్ విషయంలోనూ నిర్లక్ష్యానికి గురయ్యాం. కానీ, సీఎం కేసీఆర్ క్రీడాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఉద్యోగాల్లో 2 శాతం, ఎడ్యుకేషన్ 0.5 రిజర్వేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో సింథటిక్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ నిర్మించామన్నారు. హైదరాబాద్ తర్వాత అంతటి విశిష్టత ఉన్న జిల్లా వరంగల్ అని కొనియాడారు. ఈ నేపథ్యంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా స్థానిక నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు నేషనల్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్లో మరిన్ని క్రీడా పాలసీలు తీసుకొచ్చేందుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కేటీఆర్తో చర్చించనున్నట్లు చెప్పారు. కుడా, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వివరించారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే…ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
సీఎం కేసీఆర్ వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్లో నేషనల్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సింథటిక్ ట్రాక్ను సాధించుకున్నామన్నారు. ఇక్కడికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం మంత్రులతో కలిసి నేషనల్ అథ్లెటిక్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు, జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కైలాశ్యాదవ్, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కో ఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు, అధికారులు పాల్గొన్నారు.