శాయంపేట, ఆగస్టు 26 : దళిత బంధు పథకాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాయంపేటలోని రైతువేదిక భవనంలో గురువారం 72 మందికి కల్యాణలక్ష్మి, 21 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడ్డామన్నారు. కానీ, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రంలో రాముడి పాలన నడుస్తోందన్నా రు. సీఎం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రూ.1500 కోట్ల బడ్జెట్తో రాష్ట్రంలో కల్యాణలక్ష్మి అమ లు చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లను ఎవరి స్థలాల్లో వాళ్లు కట్టుకునేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్, తహసీల్దార్ పోరిక హరికృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, సర్పంచ్లు అబ్బు ప్రకాశ్రెడ్డి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీటీసీలు మేకల శ్రీనివాస్, మాచర్ల మంగమ్మ, గొట్టిముక్కుల స్వాతి, వావిలాల వేణు, పోతు రమణారెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు వేయించాలని ఎమ్మెల్యేకు వినతి
శాయంపేట నుంచి మైలారం గ్రామానికి వెళ్లే దారిలో చెరుకు బావి వద్ద రోడ్డు పూర్తి గా ధ్వంసమైందని, దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి రామకృష్ణ, నాయకులు తెలిపారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే, పశు వైద్యశాలకు గతంలో ఉన్న రోడ్డును ప్రైవేట్ వ్యక్తులు మూసివేశారని, కొత్తగా దారి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు నాయకులు నాగరాజు, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.