కాజీపేట, జనవరి 10: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లోని సికింద్రాబాద్ – విజయవాడ నడుమ కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడవనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 19న హైదరాబాద్ పర్యటనకు వచ్చి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రారంభించనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్లో బయల్దేరి కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా విజయవాడకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగుతీస్తూ కేవలం నాలుగు గంటల్లోనే చేరుకోనుందని రైల్వే అధికారులు తెలిపారు. కొద్ది రోజుల్లోనే విశాఖపట్నం వరకు నడిపిస్తారని పేర్కొన్నారు. ఈ రైలులో కేవలం సీటింగ్తో అత్యాధునిక ప్రయాణ సౌకర్యాలు ఉంటాయి. తర్వాత బెర్తులను ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు. ఇప్పటికే రైల్వేశాఖ ఆయా స్టేషన్ల నడుమ అప్ అండ్ డౌన్ రూట్ల్లో రైలు వేగాన్ని తట్టుకునేందుకు రైలు పట్టాలను ప్రతిష్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు ఆయా సెక్షన్లోని స్థానిక అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందే భారత్ రైలు షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్ల వివరాలను విడుదల చేశారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మొత్తం 99 రైల్వేస్టేషన్లు ఉండగా, తొమ్మిది ముఖ్య రైల్వేస్టేషన్లలోనే ఆగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ – విశాఖ పట్నం నడుమ రాకపోకల్లో కేవలం 9గంటల 20 నిమిషాల్లోనే గమ్యం చేరుతుందని, సికింద్రాబాద్లో బయల్దేరి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అనకాపల్లి స్టేషన్లలో ఆగి, విశాఖపట్నం రైల్వేస్టేషన్కు చేరుకుంటుందని వివరించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై భువనగిరి రైల్వేస్టేషన్కు 00.37 గంటలకు, వరంగల్ రైల్వేస్టేషన్లో 1.39కు, మహబూబాబాద్కు 02.18లకు ఖమ్మంకు 2.49, విజయవాడకు తెల్లవారుజామున 4.25, ఏలూరుకు 5.20, రాజమండ్రి 6.25, జంక్షన్కు 7.07, అనకాపల్లికి 8.19, విశాఖపట్నంకు ఉదయం 9.20కు చేరుకుంటుందని వివరించారు. రాకపోకల్లో సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల్లో 4 స్టేషన్లు, విజయవాడ రైల్వే డివిజన్లో 5, విశాఖపట్నం రైల్వే డివిజన్లో ఒక స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.