వరంగల్, ఆగస్టు 26 (నమస్తేతెలంగాణ) : వరంగల్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇదేరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో విజయం ఎవరిని వరించనుంది, బరిలో ఉన్న రెండు ప్యానళ్లలో ఏ ప్యానల్కు గెలుపు దక్కనుంది, కార్యనిర్వాహక కమిటీకి పదో అధ్యక్షుడిగా ఎన్నికయ్యేదెవరో.. అనే విషయాలపై వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇండస్ట్రీ లీగల్ అడ్వయిజర్ చకిలం ఉపేందర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.
చాంబర్ పరిధి.. చేసిన పనులు..
వరంగల్లో ముఖ్యమైన అడ్తి, కాటన్, చిల్లీస్, రైస్మిల్స్ అండ్ పిల్వాయి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, కిరాణా, గ్రౌండ్నట్, టర్మరిక్ అండ్ ఆయిల్ మిల్స్, అనాజ్, ఆయిల్ డీలర్స్, కోల్డ్ స్టోరేజ్, ఫ్రూట్స్, బార్దాన్, సాల్ట్ అండ్ జాగరీ, ఆనియన్ అండ్ పొటాటో, వెజిటెబుల్ తదితర సెక్షన్లు చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ పరిధిలో ఉన్నాయి. వ్యాపారులు, హమాలీలు, ఎడ్లబండ్ల వారికి, మిల్లు వర్కర్లు, పత్తి కటాయింపు కార్మికుల నడుమ తలెత్తిన వివాదాలను వివిధ ట్రేడ్ యూనియన్ల నేతలు, వ్యాపారులతో చర్చించి పరిష్కరించడంలో చాంబర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఖరీదుదారుల నుంచి అడ్తిదారులకు రావాల్సిన డబ్బులను ఇప్పించడంలోనూ కృషి చేసింది. చాంబర్ చొరవతో వ్యవసాయ మార్కెట్ లైసెన్స్ గల అడ్తి, ఖరీదు లైసెన్సుల రెన్యువల్, కొత్త లైసెన్సులపై బ్యాంక్ గ్యారంటీ సెక్యూరిటీ డిపాజిట్ను ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గించింది. నకిలీ విత్తనాల విక్రేతలు, విద్యుత్ చార్జీలు, రైల్వేశాఖలో ప్రాతినిధ్యం, కరోనా, స్పైసెస్ బోర్డు నుంచి మిర్చి పరిశోధన కేంద్రం వంటి పలు అంశాల్లో వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే దిశలో పనిచేస్తున్నది.
చాంబర్ పీఠంపై ఇప్పటివరకు..
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కార్యనిర్వాహక కమిటీ పదవీకాలం రెండేళ్లు. కొందరు ఒకటికంటే ఎక్కువ సార్లు ఎన్నికై కార్యనిర్వాహక కమిటీలో పనిచేశారు. ఇప్పటివరకు వరంగల్ చాంబర్ అధ్యక్షులుగా తొమ్మిది మంది వ్యాపారవేత్తలు పనిచేశారు. పూర్వ అధ్యక్షుల్లో కొండూరు రామలింగం, కొండూరు బుచ్చిరాజలింగం, సిద్దంశెట్టి రామనాథం, రామిని మృత్యుంజయలింగం, గుండా విశ్వనాథం, తుమికి రమేశ్బాబు, దిడ్డి కుమారస్వామి, కంభంపాటి కుమారస్వామి, కటకం పెంటయ్య ఉన్నారు. వీరిలో దిడ్డి కుమారస్వామి, రామిని మృత్యుంజయలింగం ఎక్కువసార్లు అధ్యక్షులుగా పనిచేశారు. దిడ్డి కుమారస్వామి ఏడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1948 నుంచి 1950 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన కొండూరు రామలింగం చాంబర్ తొలి అధ్యక్షుడు. 2018 ఏప్రిల్ 20న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఏడోసారి దిడ్డి కుమారస్వామి ఎన్నికయ్యారు. చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిలో ఇప్పటివరకు పదహారు మంది పనిచేశారు. వీరిలో రామిని మృత్యుంజయలింగం, యెలిశాల కనకయ్య, చకిలం విరూపాక్షలింగం, పార్శి ఈశ్వరయ్య, భూపతి కృష్ణమూర్తి, గుండా విశ్వనాథం, గుండా ప్రకాశరావు, కొండూరు రాజ్కుమార్, ఓరుగంటి శ్రీనివాసులు, అబ్దుల్ ఖయ్యూం, తుమికి రమేశ్బాబు, శ్యాంసుందర్సోని, బొమ్మినేని రవీందర్రెడ్డి, సురేశ్కుమార్ దాలియా, గోరంటాల యాదగిరి, తోట నర్సింహారావు ఉన్నారు.
రాజకీయ రంగంలోకి..
చాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీలో పనిచేసిన పలువురు నేతలు తర్వాత రాజకీయరంగంలోకి దిగడం విశేషం. అధ్యక్షులుగా పనిచేసిన తుమికి రమేశ్బాబు, దిడ్డి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన గుండా ప్రకాశ్రావు ఇక్కడి రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. తుమికి రమేశ్బాబు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్గా పనిచేశారు. దిడ్డి కుమారస్వామి కార్పొరేటర్గా జీడబ్ల్యూఎంసీలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా ఆయన భార్య దిడ్డి భాగ్యలక్ష్మి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఇక గుండా ప్రకాశ్రావు కొద్ది నెలల క్రితం వరకు వరంగల్ నగర పాలక సంస్థ మేయరుగా పనిచేశారు.