వరంగల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ సెంట్రల్ జైలును కొత్తగా మామునూరులో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖిలా వరంగల్ మండలం మామునూరులోని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) నాలుగో బెటాలియన్ పరిధిలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీ ఆవరణలో ఉన్న 101 ఎకరాలను కేటాయించింది. ఈ భూమి చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు ప్రారంభించేందుకు వీలుగా స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలం జైళ్ల శాఖ ఆధీనంలో ఉంది. సెంట్రల్ జైలు కోసం కొత్త భవనం నిర్మించేందుకు టీఎస్ఎస్పీ బెటాలియన్లోని 101 ఎకరాల భూమిని జైళ్లకు శాఖకు అప్పగించారు. ఈ స్థలంలో అత్యాధునిక పద్ధతిలో జైలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, కొత్త చట్టాలకు అనుగుణంగా సువిశాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఓపెన్ ఎయిర్ జైలుగా దీన్ని నిర్మించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బెటాలియన్ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగకుండా నిర్మాణ పనులు జరుగనున్నాయి. కొత్త సెంట్రల్ జైలు రోడ్డును ప్రత్యేకంగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరంగల్ మహానగరాన్ని అన్ని రకాల వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా సీఎం కేసీఆర్ సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించాలని నిర్ణయించారు. జూన్ 21న కొత్త హాస్పిటల్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. దీని కోసం సెంట్రల్ జైలును తరలించారు. వరంగల్ సెంట్రల్ జైలులోని ఖైదీలను చర్లపల్లి, చంచల్గూడ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ జైళ్లకు పంపించారు. నిజాం కాలం నుంచి వరంగల్లో అన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇదే కోవలో సెంట్రల్ జైలు ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో ఇది కొనసాగింది. వరంగల్ నగరం మధ్యలో ఉన్న జైలును హైదరాబాద్ తరహాలో నగర శివారులోని విశాలమైన స్థలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అనుగుణంగా సెంట్రల్ జైలును మామునూరు ప్రాంతానికి తరలించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, కొత్త చట్టాలకు అనుగుణంగా సెంట్రల్ జైలును నిర్మించేలా ఏర్పాట్లు మొదలయ్యాయి. రూ.250 కోట్లతో కొత్త జైలును నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని జైళ్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కొత్త జైలు నిర్మాణ ప్రక్రియ మొదలైంది.
ఉపాధి కేంద్రం..
వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీలకు ఉపాధి కేంద్రంగా ఉంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఖైదీలకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ఖైదీలు వేతనంపై పని చేసేలా స్టీల్, కార్పెంటరీ, డైయింగ్, వీవింగ్, సబ్బులు, పినాయిల్, ప్రింటింగ్, డర్రీ, టైలరింగ్ పరిశ్రమలు ఉండేవి. సెంట్రల్ జైలును ఇప్పుడు సెమీ ఓపెన్ ప్రిజన్గా అప్గ్రేడ్ చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రెండు పెట్రోలు బంకులు, నర్సరీ, వర్మి కంపోస్టు యూనిట్లు ఉన్నాయి. ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు వీటిలో పని చేస్తున్నారు. ఈ పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను, యంత్రాలను హైదరాబాద్లోని చర్లపల్లి జైలుకు తరలించారు. మామునూరులో కొత్తగా నిర్మించే కొత్త జైలులో పాత జైలు కంటే అన్ని రకాలుగా అప్గ్రేడ్గా ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జైలును పూర్తి స్థాయి ఉపాధి కేంద్రంగా ఉండేలా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.