స్వరాష్ట్రంలో సాగుకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కుంటల పూడికతీత.. అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన.. ఎకరానికి రూ.10వేలు చొప్పున పంట పెట్టుబడి సాయం.. రైతు మృతిచెందితే ఆ కుటుంబానికి రూ.5లక్షల రైతు బీమా.. పంటల సాగు కోసం నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా.. గిట్టుబాటు ధర లేకపోతే ధాన్యం బస్తాలను నిల్వచేసేందుకు మండలాల వారీగా గిడ్డంగుల నిర్మాణం.. రైతులు తమ సాదకబాధలు, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు అనే విషయాలు చర్చించుకునేందుకు రైతు వేదికలు తదితర సౌకర్యాలు కల్పిస్తూ రైతులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఖిలావరంగల్ మండలంలోనే సుమారు పదివేల మంది రైతులకు పంట పెట్టుబడి కింది ఏటా రూ.7.60కోట్లు అందుతున్నాయి. ఈ యాసంగిలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరి పంటకు ప్రాధాన్యమిచ్చారు. వాస్తవానికి ఏటా యాసంగిలో ఖిలావరంగల్ మండలంలో మక్కలు ఎక్కువగా పండిస్తారు. కానీ, ఈ సారి సాగునీరు అధికంగా ఉండడంతో రైతులు రెండో పంట కూడా వరి వేయడం విశేషం.
ట్రాక్టర్ల పన్ను రద్దుతో మేలు
తొలి కేబినెట్ సమావేశంలోనే వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, ట్రేలర్లకు త్రైమాసిక పన్ను రద్దు చేసిన ఘనత తెలంగాణ సర్కారుదే. అలాగే, అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.77కోట్లు ట్రాక్టర్ల పన్ను బకాయిలను కూడా సీఎం కేసీఆర్ పూర్తిగా మాఫీ చేశారు. ఒక్కో వ్యవసాయ ట్రాక్టర్కు ఏడాదికి రూ.1200 రైతు లు పన్ను చెల్లించేవారు. అయితే, సీఎం కేసీఆర్ రైతుల ఆర్థిక స్థితిగతలను గమనించి, పన్నును పూర్తిగా రద్దు చేశారు. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాలో 10,540 వ్యవసాయ ట్రాక్టర్లకు మూడు నెలలకు ఒకసారి రూ.31.62లక్షల పన్నును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతు బంధు, రైతు బీమా, మిషన్కాకతీయ సంక్షేమ పథకాలతోపాటు వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రేలర్లపై పన్ను రద్దు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయమే దండగా అనే గత పాలకుల ద్వంద్వ నీతిని ఎండగడుతూ రైతు రాజ్యమే ప్రజా సంక్షేమానికి పునాదిగా భావించి, రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
రైతు బంధు చాలా గొప్పది
రైతు బంధు చాలా గొప్ప పథకం. అప్పులు తీసుకొచ్చి పంట లు పండించాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ, రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం ఇస్తుండడంతో ఇప్పుడు పండుగలా వ్యవసాయం చేస్తున్నాం. అతివృష్టి, అనావృష్టి నుంచి కూడా రైతు బంధు ఓదార్పునిస్తుంది. నాకున్న మూడెకరాలకు ఏడాదికి రూ.30వేలు వస్తున్నాయి. రైతు ఎలాంటి కారణంతో చనిపోయిన రూ.5లక్షలు వస్తున్నాయి. రైతుకు తెలంగాణ ప్రభుత్వం మేలు చేస్తోంది.