హైదరాబాద్ : గిఫ్ట్ వచ్చిందని వినియోగదారులను నమ్మంచి డబ్బులు దోచుకుంటూ మోసాలకు పాల్పడుతున్న 13 మంది సభ్యుల ముఠాను వరంగల్ టాస్క్ఫోర్స్, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి రూ. 14 లక్షల 36 వేల నగదుతో పాటు 15 సెల్ ఫోన్లు, స్క్రాచ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఇప్పరాజ్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మరో ప్రధాన నిందితుడు తాళ్లపల్లి దామోదర్ గౌడ్, ఇతర నిందితులతో కలిసి ఆన్లైన్ ద్వారా బహుమతులు వచ్చాయంటూ అమాయక ప్రజలను నమ్మించి డబ్బు దోచుకోవాలని ప్రణాళిక రూపొందించాడన్నారు. నిందితులు ఈ ఆన్లైన్ మోసాలకు కలకత్తా నగరాన్ని తమ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజీత్, సంజీవ్, ప్రకాశ్ లను తమ అనుచరులగా నియమించుకోని కలకత్తాలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ కార్యకలాపాలు కొనసాగించినట్లు పేర్కొన్నారు.
నేరాలను గుర్తించడంతో పాటు పెద్దమొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ పుష్పా, టాస్క్ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ ప్రతాప్ కుమార్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, జి.మధు, ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ ఆనాటికల్ అఫీసర్ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాం సుందర్, సోమయ్య, కానిస్టేబుళ్ళు అలీ, చిరంజీవి, శ్రీకాంత్, సృజన్, శ్రీనివాన్ను పోలీస్ కమిషనర్ అభినందించారు.