అమీన్పూర్, జూలై11: సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ప్రత్యేక ప్రణాళికతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున హిల్స్లో తాగునీటి పైపులైన్ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రూ.12 లక్షల సొంత నిధులు కేటాయించి రెండు కిలో మీటర్ల మేరకు ఇంటింటికీ తాగునీటి పైపులైన్ వేయించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉండొద్దు అన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ముఖ్యమంత్రి బాటలో తాను నడుస్తూ తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేయించానని చెప్పారు.
ముఖ్యమంత్రి చేపట్టిన పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని ఆయన వెల్లడించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 50 శాతం తాగునీటి సరఫరా పైపులైన్ పనులు పూర్తి చేశామని, త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో తాగునీటి వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. అనంతరం కాలనీ ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు నందారం రమేశ్గౌడ్, బాలరాజు, కాలప్ప, చంద్రశేఖర్, యూనూస్, టీఆర్ఎస్ కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.