డబ్ల్యూహెచ్వోకు తెలిపిన ఉత్తర కొరియా
సియోల్, జూన్ 22: తాము 30 వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, కానీ వైరస్ కేసు ఒక్కటి కూడా వెలుగుచూడలేదని ఉత్తరకొరియా తెలిపింది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు తెలియజేశామని వెల్లడించింది. అయితే ఓ నివేదికలో మాత్రం కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 149 మంది ఇన్ఫ్లూయెంజా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందని డబ్ల్యూహెచ్వో పేర్కొనడం గమనార్హం. మరోవైపు తమ దేశంలో కరోనా కేసులు లేవని ఉత్తర కొరియా ప్రకటించడంపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనా పక్కనే ఉన్న ఉత్తర కొరియాలో ఒక్కటి కూడా వైరస్ కేసు లేదనడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నదని పేర్కొంటున్నారు.