న్యూఢిల్లీ: పర్యావరణ హిత విద్యుత్ వాహనాల తయారీలో ఆటోమొబైల్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురందించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీదారులకు ఇచ్చే సబ్సిడీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా ఫేస్-2 (ఫేమ్- 2) పథకంలోని కొన్ని సవరణలతో భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రస్తుతం ఒక కిలోవాట్పై రూ.10 వేల చొప్పున ఇస్తున్న సబ్సిడీని రూ.15 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. అంతే కాదు వాహనాల ఖరీదులో గరిష్ఠంగా 40 శాతం వరకూ ఈ ప్రోత్సాహకాలను కేంద్రం అందించనున్నది.
గతంలో ఇది 20 శాతం మాత్రమే ఉండేది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని వ్యాఖ్యానించాయి.
ఈ మేరకు ఫేమ్-2లో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగనే బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ వాహనాల ధరలను తగ్గించింది. తన 450ఎక్స్ మోడల్పై ఏకంగా రూ14,500 తగ్గించింది. మిగిలిన స్కూటర్ల ధరలూ సవరించనున్నది.
మిగతా ఆటోమొబైల్ సంస్థలు కూడా ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అందుబాటులోకి వస్తే ఈ వాహనాలకు డిమాండ్ ఏర్పడనున్నది.