న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నుంచి బైటపడే మార్గాలుఅన్వేషించే కన్నా విమర్సించేవారి నోల్లు మూయించడం మీదనే కేంద్ర సర్కారు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తున్నది. కరోనా నియంత్రణలో, చికిత్స, టీకాల సౌకర్యాలు కల్పించడంలో కంద్రం అలసత్వం చూపిందని దేశం లోపలా, వెలుపలా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దిద్దుబాటు చర్యల మాటేమోగానీ ముందు విమర్శలపై కొరడా ఝళిపిస్తున్నది. మోదీ కరోనా విదానాలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో ఇటీవల వెలిసిన పోస్టర్లపై పోలీసులు చర్య తీసుకున్నారు. వీటికి సంబంధించి వివిధ చట్టాల కింద 21 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని నాలుగు డివిజన్లలో ఈ అరెస్టులు జరిగాయి. అంటే పైస్థాయి సమన్వయంతోనే ఇవి జరిగినట్టు భావిస్తున్నారు. మోదీజీ, ఆప్నే హారే బచ్చోకి వ్యాక్సిన్ విదేశ్ క్యూ భేజ్ దియా (మోదీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు?) అని ఓ పోస్టరులో ఉంది. “మరిన్ని ఫిర్యాదులు వస్తే మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాం.. ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతున్నది. ఎవరి ప్రోత్సాహంతో ఈ పోస్టర్లు వేశారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం” అని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.