ఇటీవల అసెంబ్లీ ఫలితాల సందర్భంలో అందరికీ ఉన్నట్లుండి ఫెడరలిజం గుర్తుకురావటం మంచిదే కానీ, దీనితో ముడిపడిన కొన్ని కీలకాంశాలను ఎవరూ చర్చించటం లేదు. అది జరగకుండా, ఆయా అంశాలపై ఫెడరలిస్టులు ఒక నిశ్చితాభిప్రాయానికి రాకుండా బీజేపీ, కాంగ్రెస్ల యూనిటరిస్టు ధోరణిని ఎల్లకాలం ఎదుర్కోలేరు. ఒక్కసారి ఎన్నికలలో గెలిచినంత మాత్రాన తమది దీర్ఘకాలిక ఫెడరలిస్టు విజయమని భావించటం పొరపాటవుతుంది.
కేంద్రీకరణ శక్తులు కూడా మొక్కుబడిగా కొత్త సంక్షేమాన్ని, వికేంద్రీకరణను చేపట్టినా, దాన్ని ఒక విశ్వాసంగా, స్పష్టమైన విధానంగా, తమ సహజ స్వభావం, ధర్మం అన్నట్లుగా అమలుపరిచేవి మాత్రం ఫెడరలిస్టు పార్టీలే. దీని అర్థం ఈ పార్టీలు కేంద్రీకృత ఆర్థికశక్తులకు పూర్తి దూరంగా ఉంటాయని కాదు. ఇద్దరి ఉనికి ఒకే దేశంలో అయినందున అది ఆచరణ సాధ్యం కాదు.
అయిదు అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించినవి బెంగాల్, తమిళనాడు, కేరళ. వీటిలో బెంగాల్లో తృణమూల్, తమిళనాట డీఎంకే ఫెడరలిస్టు శక్తులుగా ముందుకువచ్చాయి. తమిళనాడులో అన్నాడీఎంకే కూడా సాంకేతికంగా ఫెడరలిస్టు పార్టీయే అయినా, బీజేపీతో పొత్తు వల్ల ఆ గుర్తింపును కనీసం ప్రస్తుతానికి కోల్పోయింది. కేరళలో వామపక్ష కూటమికి సంప్రదాయికంగా ఫెడరలిస్టు ముద్ర లేదు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో రాష్ర్టాల హక్కుల కోసం ఒక కేంద్రీకరణ శక్తితో తలపడినందున ఆ గుర్తింపు వంటిది వచ్చింది. వాస్తవానికి అసోంలో ఏజీపీ పుట్టుక ఇటువంటిదే అయినా స్వయంకృతాపరాధాలతో అది ధ్వంసమైంది. దాని స్థానంలో మరొక ఫెడరలిస్టు శక్తి ఏదీ రూపు తీసుకోలేదు.
ఆ విధంగా తృణమూల్, డీఎంకే, వామపక్ష కూటమి గెలుపును ఫెడరలిస్టు విజయాలుగా ఇప్పుడు అగ్రశ్రేణి వ్యాఖ్యాతల నుంచి మొదలుకొని అందరూ కొనియాడుతున్నారు. ఈ ఎన్నికల ముందువరకు అందరూ, బీజేపీ కేంద్రీకరణ ఉధృతికి ఇక ఎదురులేదనే అభిప్రాయంతో నిరాశపడి ఉన్నారు. బీజేపీ పట్ల నిరసనకు అది ఒక కారణమైంది. ఇంతలో ముందుకువచ్చిన కరోనాతో ఆగ్రహం పెరిగింది. ఇటువంటి పరిస్థితులలో తృణమూల్, డీఎంకే, వామపక్ష కూటమి స్పష్టమైన రీతిలో గెలవటం వ్యాఖ్యాతల సంతోషానికి కారణమైంది. గెలిచింది కాంగ్రెస్ అనే మరొక కేంద్రీకరణ శక్తి కానందున వీరికి సహజంగానే ఇవి ఫెడరలిస్టు విజయాలుగా తోచాయి. ఇక్కడ గమనించవలసిందేమంటే, 2014లో బీజేపీ అధికారానికి వచ్చి పలుచోట్ల ప్రాంతీయ పార్టీలు ఓడుతుండినప్పటికీ ఫెడరలిజానికి- కేంద్రీకరణకు మధ్య ఘర్షణ ఎల్లప్పుడూ సజీవంగానే ఉంది. ఆ ఘర్షణ 2014కు ముందంతా కాంగ్రెస్తో ఉండినదే. ఆ తర్వాత కూడా కొనసాగుతున్నది. ఈ క్రమంలో 2014 తర్వాత కొన్నిసార్లు గెలిచింది, కొన్ని సార్లు ఓడింది, ఇప్పుడు మరొకసారి గెలిచింది. అంతే తప్ప కొత్తగా ముందుకురాలేదు. దృష్టి లోపమల్లా వ్యాఖ్యాతలది. ఫెడరలిజానికి తనదైన స్వరూపం (Form), స్వభావం (Content) ఉంటాయి. వాటిని సరిగా అనుసరించినంత కాలం తిరుగుండదు.
ఇక్కడ గుర్తించవలసిన కీలకమైన విషయం ఒకటున్నది. చాలామంది కేంద్రీకరణ అంటే రాజకీయమైనది, అధికారపరమైనది అనుకుంటారు ఈ రెండూ ఉంటాయి. కానీ అంతకన్న ముఖ్యంగా ఆర్థికపరమైన కేంద్రీకరణ ఉంటుంది. రాజకీయ, అధికార కేంద్రీకరణ రాజకీయవాదుల కోసం, ఆర్థిక కేంద్రీకరణ వారి వెనుక ఉండే ఆర్థికశక్తుల కోసం జరుగుతుంది. వీరిద్దరి మధ్య పరస్పర సహకారం ఉంటుంది. వీరిద్దరు కలిసి అనుసరించే పరిపాలన నమూనాలో వారిద్దరి ప్రయోజనాలకు చాలా పెద్దపీట ఉంటుం ది. రాష్ర్టాల ఫెడరలిస్టు హక్కులకు, ఫెడరలిస్టు పార్టీల స్వేచ్ఛాయుతమైన వ్యవహరణకు, వాటిద్వారా సాధారణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేందుకు చాలా చిన్న పీట ఉంటుంది. ఫెడరలిస్టులది ఈ రెండ వ నమూనా. ఈ రెండు నమూనాల మధ్య ఘర్షణ ఒక నిరంతర స్థితి. లేదా శాశ్వత స్థితి. ఇది రెండు ఫిలాసఫీల ఘర్షణ. క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజలతో ఫెడరలిస్టులకు ఉండే అనుబంధం యూనిటరిస్టులకు ఉండదు.
ఈ మాట ఇక్కడ కొత్తగా కనిపెట్టి చెప్తున్నది కాదు. ఈ స్థితి భారతదేశానికి ప్రత్యేకమైనది కాదు. అంతటా ఉన్నదే. దీనిపై లెక్కలేనన్ని అధ్యయనాలున్నాయి. అయితే ఈ రెండు నమూనాల మధ్య ఘర్షణ ఆర్థిక సంస్కరణల కాలం నుంచి తీవ్రమైంది. ఆధునిక శాస్త్ర- సాంకేతికతల సహాయంతో ప్రకృతి వనరులను ఎన్నడూ లేనంతగా వినియోగంలోకి తెచ్చి, ఆ లాభాలను కొద్దిమంది చేతిలో కేంద్రీకరింపజేయటం ఒక నమూనా అయింది. కానీ ఇటువంటి మితిమీరిన కేంద్రీకరణ వల్ల హాని కలుగుతుందనే ఆలోచనతో సంపదలను సంక్షేమం, సాధారణాభివృద్ధి రూపంలో తగినంత వికేంద్రీకరించటం మరొక నమూనా అయింది.
ఇతర దేశాలలో ఏమి జరుగుతున్నది అట్లుంచితే, ఈ రెండవ నమూనా భారతదేశంలో ఫెడరలిస్టు పార్టీల ద్వారా అమలవుతున్నది. ఇండియా వంటి మహా వైవిధ్య దేశానికి తగిన నమూనా ఇదే. కేంద్రీకరణ శక్తులు కూడా మొక్కుబడిగా కొత్త సంక్షేమాన్ని, వికేంద్రీకరణను చేపట్టినా, దాన్ని ఒక విశ్వాసంగా, స్పష్టమైన విధానంగా, తమ సహజ స్వభావం, ధర్మం అన్నట్లుగా అమలుపరిచేవి మాత్రం ఫెడరలిస్టు పార్టీలే. దీని అర్థం ఈ పార్టీలు కేంద్రీకృత ఆర్థికశక్తులకు పూర్తి దూరంగా ఉంటాయని కాదు. ఇద్దరి ఉనికి ఒకే దేశంలో అయినందున అది ఆచరణ సాధ్యం కాదు. అదే సమయంలో కేంద్రీకృత రాజకీయ శక్తులతో పోల్చినప్పుడు చాలా తేడాలుంటాయి.
ఫెడరలిస్టు శక్తులు రానున్న కాలంలో చేయవలసింది ఈ రెండవది అయిన తమ నమూనాను మరింత స్పష్టంగా నిర్వచించుకొని, మరింత సమర్థవంతం గా అమలుపరచటం. తమ ప్రజల బాగు కోసం, తమ బలిమి కోసం, యూనిటరిస్టు శక్తులను నిలువరించేందుకు ఇది తప్పనిసరి. అప్పుడు ఇటువంటి విజయాలు ఎన్నయినా లభిస్తాయి.
టంకశాల అశోక్