కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఐదో దశల ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. చివరి గంటలో కరోనా రోగులు ఓటు వేసేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో పోలింగ్కు ఎన్నికల సంఘం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రోటోకాల్స్ కఠినంగా పాటించేలా ఈసీ చర్యలు చేపట్టింది. అలాగే మాస్క్లు ధరించడం, సామాజిక దూరం నిబంధనలు కొనసాగించేలా ఏర్పాట్లు చేసింది.
294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో 159 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. శనివారం మరో 45 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 342 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. కోటి మంది ఓటర్లు భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఐదో దశలో కీలక నేతలు సిలిగురి మేయర్, లెఫ్ట్ఫ్రంట్ నేత అశోక్ భట్టాచార్య, రాష్ట్రమంత్రులు గౌతమ్ దేబ్, బ్రాత్యబసు, బీజేపీ నేత సామిక్ భట్టాచార్య బరిలో ఉన్నారు.
ఐదో దశ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీ భద్రత కల్పించింది. నాలుగో విడుత ఎన్నికల సందర్భంగా కూచ్బెహార్ జిల్లాలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. సీఐఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకునేలా 853 కేంద్ర బలగాలను మోహరించింది.
ఐదో దశ ఎన్నికలు ఉత్తర 24 పరగణాల్లో 16 సీట్లు, పూర్బా బర్ధమన్లో 8, నాడియాలో ఎనిమిది, జల్పాయిగురిలో ఏడు, డార్జిలింగ్లో ఐదు, కాలింపాంగ్ జిల్లాలో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మిగతా స్థానాలకు ఈ నెల 22న, 26న, 29న ఆరు, ఏడు, ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 2న ఈసీ ఫలితాలు ప్రకటించనుంది.