హైదరాబాద్ : పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యా పథకం అద్భుతమని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో ఓవర్సీస్ విద్యా పథకంపై పలువురు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానమిచ్చారు.
‘విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే యువతకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందజేస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న పథకాల్లో ఇదో గొప్ప పథకం. ఇలాంటి అద్భుత పథకాలు తెలంగాణలో మినహా దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 3,676 మంది విద్యార్థులకు ఈ పథకం కింద చేయూతనిచ్చాం. ఇందుకు ప్రభుత్వం రూ. 589 కోట్ల 69 లక్షలు వెచ్చించింది. లబ్ధిదారుల్లో అమెరికాలో 54%, ఆస్ట్రేలియాలో 21%, ఇంగ్లాండ్ లో 11.5%, కెనడా, సింగపూర్,జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో చదువుతున్నారు’ అని మంత్రి తెలిపారు.
కుటుంబంలో ఎంబీబీఎస్ చదివే ఒక్కరికి మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయగా.. మరొకరికి కూడా వర్తింపజేయాలన్న సభ్యుల విజ్ఞప్తిని ప్రభుత్వం తప్పక పరిశీలిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఓవర్సీస్ విద్యా పథకం గొప్ప పథకమని కొనియాడారు. ఈ పథకం స్ఫూర్తితోనే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఇదే తరహా పథకం ప్రవేశపెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.