ధారూరు : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మిషన్భగీరథ లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని, నీరు కలుషితం కాకుండా చూడాలని అధికారులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ, 5వ వార్డులను మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మున్సిపల్ పరిధిలోని గాంధీకాలనీ, శివరెడ్డిపేట్ కాలనీల్లో ఉన్న సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శివరెడ్డి పేట్లోని బావిలో పెరిగిన చెట్లను తొలగించి యథావిధిగా బావి పైకప్పును ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో కొన్ని చోట్ల ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి నూతన తీగలను ఏర్పాటు చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న స్తంభాలను తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, పార్టీ నాయకులు, పాల్గోన్నారు.