25 వరకు రైతుబంధు: ఎమ్మెల్సీ పల్లా
ఇల్లందకుంట, జూన్ 17: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆస్తులపై ఉన్న తాపత్రయం, అభివృద్ధిపై లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రగతిని ఏనాడూ పట్టించుకోలేదని, ప్రభుత్వ పథకాలను పరిగె అని మాట్లాడినోడికి ఇవన్నీ ఏం తెలుసని ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని 4.5 లక్షల మందికి కొత్త రేషన్కార్డులు అందజేస్తామని తెలిపారు. 57 ఏండ్లు ఉండి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరుచేస్తామని చెప్పారు. రాబోయే ఉపఎన్నికలో హుజూరాబాద్లో గులాబీ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. రైతుబంధు డబ్బులు ఈ నెల 25 వరకు ప్రతి ఒక్కరి ఖాతాలో జమవుతాయని చెప్పారు.
ఈటల కుట్రదారు: ఎమ్మెల్యే రవిశంకర్
ఈటల కుట్రదారుడని ఇన్నాళ్లూ ప్రభుత్వంలో ఉంటూ కడుపులో విషం పెట్టుకొని పనిచేశారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.