హైదరాబాద్ : తెలంగాణ చేనేత, జైళిశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ గోల్కొండ ప్లాట్ ఫాం (పోర్టల్)ను ప్రగతిభవన్లో గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ -గోల్కొండ ద్వారా అద్భుతమైన సంప్రదాయ కళాకృతులు, చేతి బొమ్మలను కొనుగోలు చేసే వీలు ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేనేత, జౌళిశాఖలో ఓ విభాగమైన హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను బలోపేతం చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అనేక అద్భుతమైన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి ఈ-మార్కెట్ ప్లేస్ని తయారు చేయడమే లక్ష్యంగా పోర్టల్ను రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక ప్రైవేటు ఈ-కామర్స్ వెబ్సైట్ల కంటే అత్యుత్తమంగా ఈ వెబ్ పోర్టల్లో సౌకర్యాలు కల్పించామన్నారు.
వెబ్సైట్లో ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళాకృతులు చేర్చేందుకు వీలుందన్నారు. త్వరలోనే కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు పొంది.. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడికైనా కళాకృతులు పంపే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ- గోల్కొండ ద్వారా అమ్మకానికి ఉంచిన ప్రతి కళా కృతిని సునిశితంగా పరిశీలించేందుకు అవసరమైన 3డీ టెక్నాలజీని సైతం అందుబాటులో ఉంచామన్నారు. ఈ వెబ్సైట్ను మొబైల్ ఫోన్లకు సరిపడే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. సైట్ ద్వారా రాష్ట్రంలో తయారవుతున్న హ్యాండీక్రాఫ్ట్, ఇతర అద్భుతమైన కళాకృతులకు మార్కెటింగ్, అవసరమైన ప్రచారాన్ని కల్పించే వీలు కలుగుతుందన్నారు. https://golkondashop.telangana.gov.in లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేయవచ్చని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో అనేక శతాబ్దాలుగా కొనసాగుతున్న అద్భుతమైన హస్తకళలను కొనసాగించేందుకు టెక్స్టైల్ శాఖ తరఫున అవసరమైన నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ వంటి సేవలతో పాటు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసి కళాకారులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తెలంగాణ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, చేనేత జౌళిశాఖ డైరెక్టర్ శైలజ రామయ్యార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.