యాదాద్రి నిర్మాణం అద్భుతం
నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా ప్రశంస
యాదాద్రి, ఫిబ్రవరి 12: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ప్రధానాలయాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉన్నదని, యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని సినీనటి, ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. స్వామివారి ఆలయాన్ని భగవంతుడే సీఎం కేసీఆర్ ద్వారా నిర్మించుకొంటున్నాడని కొనియాడారు. భీష్మ ఏకాదశి సందర్భంగా శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆమె దర్శించుకొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ఈ కాలంలో ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. చాలా శక్తిమంతుడైన యాదాద్రీశుడి ఆలయాన్ని నిర్మించే అవకాశం రావడం గొప్ప విషయమని చెప్పారు. కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం చాలా బాగున్నదని, రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయ నిర్మాణం జరిగిందని తెలిపారు.