తెలంగాణలోని విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావి తరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతను ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయి. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెరిగింది.
రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఇందులో బాలికల కోసం 100 హాస్టళ్లు ఏర్పాటు చేశారు. బాలికల కేజీబీవీలను బలోపేతం చేసి, అందులోనే జూనియర్ కాలేజీలను నెలకొల్పారు
తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 (261+37 జనరల్) రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. అందులో 1 లక్షా 45 వేల మంది విద్యార్థులు చదువుకునేవారు. స్వరాష్ట్రంలో కొత్తగా 671 ( 618 స్కూళ్లు + 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 969 (916+53డిగ్రీ కాలేజీలు)కి తీసుకువచ్చింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి అత్యంత భద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం రెసిడెన్షియల్స్ ను బాలికల కోసం కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ (డిగ్రీ రెసిడెన్షియల్స్ మినహాయిస్తే) స్కూళ్లలో 4 లక్షల 30 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ.1.20 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి, దుస్తులు, పుస్తకాలు, యూనిఫారం, బెడ్డింగ్, షూస్, క్రీడా సౌకర్యాలు, గ్రంథాలయాలు, ల్యాబ్ లను ఉచితంగా సమకూరుస్తున్నారు. వారంలో ఆరు సార్లు మాంసాహారం అందిస్తున్నారు. ఈ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు చలికాలంలో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం బెడ్ షీట్లు, చెద్దర్లు పంపిణీ చేస్తున్నది. కొత్త గురుకులాలకు 240 నూతన భవనాల స్థలాలను కేటాయించి.. ఒక్కో గురుకుల భవనాన్ని రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్నారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు కేవలం నీట్ ర్యాంకులే కాకుండా, దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. 2018-19 లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బిసి గురుకులాల్లో చదువుకునే విద్యార్ధులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. 59 శాతం మంది 90 శాతానికి పైగా మార్కులు సాధించగా.. 29 శాతం మంది విద్యార్ధులు 95 శాతం మార్కులు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తుండటంతో విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
తెలంగాణ రాకముందు మైనారిటీలకు 12 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే వుండేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరమే కొత్తగా 71 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే, 2020 నాటికి మరో 192 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించారు. దీంతో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 204 కు చేరింది. ఈ స్కూళ్లలో 4,188 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, మొత్తం 90,160 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటును లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2016-17లో 5,6,7వ తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రతీఏడాది ఒక్కోతరగతి పెంచుకుంటూ పోతారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి, దుస్తులు, పుస్తకాలు, యూనిఫారం, బెడ్డింగ్, షూస్, క్రీడా సౌకర్యాలు, గ్రంధాలయం, పరిశోధనశాలలన్నింటినీ ఉచితంగా సమకూరుస్తున్నారు.
8 మైనారిటీ గురుకులాలలు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ : కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు క్రమంగా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇది వరకు ఎస్సెస్సీ వరకే విద్యాబోధన జరుగగా, 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్య అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో బీసీలకు కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. స్వరాష్ట్రంలో కొత్తగా 261 రెసిడెన్షియల్ స్కూళ్లు, 1 డిగ్రీ కాలేజీ ఏర్పాటయ్యాయి. (ఇందులో 17 జూన్, 2019న నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున ప్రారంభించిన బీసీ గురుకులాలు కూడా కలిపి ఉన్నాయి) దీంతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 281 కి చేరింది. బిసి గురుకులాల్లో 5,335 మంది టీచర్లు పనిచేస్తుండగా, మొత్తం 91,680 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొదటి ఏడాది 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున మొదటి ఏడాది ఒక్కో గురుకులంలో 240 మంది పిల్లలకు ప్రవేశం కల్పించారు. ఐదేళ్లలో ఒక్కో ఏడాది ఒక్కో తరగతిని పెంచుతూ 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు. అప్పుడు ఒక్కో స్కూళ్లో 640 మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇంటర్ మీడియేట్ ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 65% ఉండగా.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకన్నా గురుకుల విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపిస్తున్నారు.
ఎస్సీలకు కొత్తగా 104 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ కళాశాలలు రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్సీలకు 134 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా ఎస్సీలకు 104 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం గురుకులాల సంఖ్య 268 వరకు చేరింది. ఇందులో 238 గురుకుల పాఠశాలల్లో 3,037 మంది టీచర్లు పనిచేస్తుండగా, 1,30,960 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 30 డిగ్రీ కళాశాలల్లో 656 మంది లెక్చరర్లు పనిచేస్తుండగా 25,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్టీల కోసం 96 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి. రాష్ట్ర అవతరణ తరువాత ఎస్టీల కోసం 62 గురుకులాలు, 22 డిగ్రీ కాలేజీలు (మొత్తం 84) ప్రారంభించారు. 2020 నాటికి పాతవి 96 + 84 కొత్తవి కలిపి రాష్ట్రంలో మొత్తం 180 గురుకులాలు ఉన్నాయి. ఇందులో 158 గురుకుల పాఠశాలల్లో 2,573 మంది టీచర్లు పనిచేస్తుండగా, 55,051 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 22 డిగ్రీ కళాశాలల్లో 880 మంది లెక్చరర్లు పనిచేస్తుండగా 7,835 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
తెలంగాణలో గిరిజన విద్యార్థుల కోసం 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండగా, కొత్తగా 7 స్కూళ్ల (ఈఎంఆర్ఎస్) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడురులో, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, ముల్కలపల్లిలో, ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఈ స్కూళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో 6,090 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.09 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు.
గిరిజన విద్యార్థులకు చేయూతనందించడానికి ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు కోసం టాస్క్ సెల్ పనిచేస్తుంది. అవసరమైనవారు 040-48488241 నంబరులో సంప్రదించవచ్చు.
పేద విద్యార్థులకందరికీ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులతోపాటు, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ స్కాలర్ షిప్స్ అందించడం జరుగుతుంది. ప్రతీ సంవత్సరం 14 లక్షల మంది పేద విద్యార్థులు స్కాలర్ షిప్స్ పొందుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఏటా రూ.2400 కోట్లు ఖర్చు చేస్తున్నది.
విద్యా సంవత్సరం పూర్తికాకముందే స్కాలర్ షిప్స్ విద్యార్ధుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు 2018-19 విద్యాసంవత్సరం నుంచి స్కాలర్ షిప్స్ ముందే అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధ్రువపత్రాల పరిశీలనను ప్రారంభించి ఫిబ్రవరి 2019 నాటికి పూర్తిచేయాలని నిర్ణయించింది. 20 జనవరి, 2019 నాటికి సుమారు 10.22 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిని త్వరగా పరిశీలించి ఉపకార వేతనాలు మంజూరు చేయనున్నారు.
రాష్ట్రంలోని 27 తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ తరగతులను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 27 తెలంగాణ గురుకుల పాఠశాలల హోదా పెంచి ఇంటర్మీడియట్ కాలేజీలుగా గుర్తిస్తూ 2018 మార్చి 21న ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ గురుకుల విద్యాసంస్థల్లో 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభిస్తారు. ఇందులో 13 బాలుర గురుకులాలు, 14 బాలికల గురుకులాలు ఉన్నాయి. వీటికోసం అదనంగా 405 పోస్టులను మంజూరు చేయడంతోపాటు రూ.117.79 కోట్ల బడ్జెట్ విడుదల చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రా పౌట్స్ తగ్గుతూ, రిటెన్షన్ (విద్యా సంవత్సరం చివరి వరకు కొనసాగడం) పెరుగుతున్నాయని సర్వశిక్షా అభియాన్ తన వార్షిక నివేదికలో(2017-18) తెలిపింది. 33 జిల్లాల్లో కలిపి 69.83 శాతం రెటెన్షన్ రేటు నమోదైంది. 2016-17లో డ్రాపౌట్స్ రేటు 18 శాతం ఉండగా, 2017-18 లో 3.3 శాతానికి తగ్గింది. ప్రమోషన్ రేటు (పై తరగతులకు వెళ్లేవారు) 96.4 శాతం నమోదయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు సన్నబియ్యం, ఉచిత పుస్తకాలు, రెండు జతల యూనిఫారాల పంపిణీ, వందశాతం మెస్ చార్జీలు తదితర కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గాయి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం డిగ్రీ కాలేజీల బలోపేతానికి చర్యలు చేపట్టింది. విద్యార్థులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసింది. దీంతో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2016-17లో 22,820 అడ్మిషన్లు నమోదవగా.. 2017-18లో 27,802, 2018-19 లో 42,266 మంది ప్రవేశాలు పొందారు. 2019-20 విద్యా సంవత్సరంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో కలిపి మొత్తం 70 వేల పైచిలుకు సీట్లు అందుబాటులోకి తేవడంతో గతం కంటే ఈ సారి 39శాతం ప్రవేశాలు నమోదయ్యాయి. కోర్సు, మీడియం డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సీట్లు పెంచారు. ముఖ్యంగా బీకాం కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు ఇంగ్లిష్ మీడియంలో ఎక్కువ సీట్లు అందుబాటులో ఉంచారు. డిమాండ్ లేని కోర్సులను మూసివేసి, ఉద్యోగాలు పొందేందుకు అనుకూలంగా ఉండే వాటినే అందిస్తుండడంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఈ పథకం అమలయ్యేది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఇబీసీ, మైనారిటీలకు కూడా అమలు చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వం అగ్రవర్ణ కులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేసింది. గతంలో కేవలం పది లక్షల రూపాయల గరిష్ట పరిమితి ఉండేది. ఇప్పుడు ఈ పథకం కింద రూ. 20 లక్షల వరకు అందిస్తున్నారు. ఆదాయ పరిమితిని కూడా రూ. 4 లక్షల 50 వేలకు పెంచారు. పది శాతం ఓవర్సీస్ స్కాలర్షిప్లు హ్యుమనిటీస్, ఎకనామిక్స్, అకౌంట్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రిజర్వ్ చేశారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ తో పేద విద్యార్థులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇలాంటి పథకమే ఉన్నా.. వందమందిలోపే విద్యార్థులు ఎంపికయ్యారు. స్కాలర్షిప్ రూ. 5 లక్షలు కూడా ఉండేదికాదు. ఇప్పుడు రూ.20 లక్షలు కేటాయిస్తున్నారు.
ఉన్నత చదువులు చదివే స్థోమత లేక మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్న వారిని ప్రోత్సహించి విదేశాల్లో చదువుకోవాలనే లక్ష్యాన్ని నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం ఓవర్సీస్ స్కాలర్షిప్. 2014 నుంచి 2020 డిసెంబర్ వరకు 3,823 మందిని విదేశీ విమానం ఎక్కించింది.
ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్’ పథకాన్ని 2015 మే 19న ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమం అమలులో వుంది. అదే తరహాలో మైనారిటీలకు కూడా ఆర్థిక చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావంతులైన మైనారిటీలు మరింత ఉన్నత చదువుకోసం విదేశాలకు వెళ్లాలంటే, చాలామందికి ఆర్థిక స్థోమత వుండదు. అలాంటి వారికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నది. ఒక్కొక్కరికి పది లక్షల స్కాలర్ షిప్ తోపాటు విమానయాన ఖర్చులు కూడా అందించేవారు. కానీ, ఈ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ఆదాయ పరిమితిని కూడా 4.5 లక్షల రూపాయలకు పెంచారు. మైనారిటీల ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్’ ద్వారా 2020 జనవరి నాటికి 1,436 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.218.92 కోట్లు ప్రభుత్వం సాయం అందించింది.
ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ఇస్తున్నది. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ 35 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం (అనగా 2014-15) నుండి 2019 ఆగస్టు 1 నాటికి 489 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.72.99 కోట్లు, 146 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.21.65 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఆర్థిక సాయం పొందినవారిలో 55 మంది అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తుండటం విశేషం. మరికొందరు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో చదువుకుంటున్నారు. ఎస్సీలలో దాదాపు 89 శాతం మంది అమెరికాలోని ప్రముఖ వర్సిటీల్లో చేరారు.
బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశపెడుతూ 2016 అక్టోబర్ 10న జి.ఓ.నెం.23 జారీ చేసింది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. 2019 ఆగస్టు నాటికి 536 మంది బీసీ విద్యార్థులు లబ్ధిపొందారు. వీరికోసం రూ. 75.97 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కువమంది ఆస్ట్రేలియా, కెనడాల్లోని వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
ఆగస్టు 2019 నాటికి 34 మంది ఈబీసీ విద్యుర్థులకు ఈ పథకం ద్వారా సహాయం అందించారు. వీరికి ప్రభుత్వం రూ.3.40 కోట్ల సాయాన్ని అందజేసింది.
బ్రాహ్మణులకు : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి వివేకానంద ఓవర్సీస్ విద్యాపథకం ద్వారా గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు మంజూరు చేశారు. ఈ పథకం కింద 522 మంది పట్టభద్రుల విదేశీ విద్యకు ఉపకారవేతనాలు అందించారు. వివేకానంద విదేశీ విద్యా పథకం, బెస్ట్ స్కీమ్ , రామానుజ ఫీజు రియింబర్స్ మెంట్ స్కీమ్ ల కింద ఏటా పేద బ్రాహ్మణ విద్యార్ధులకు బ్రాహ్మణ పరిషత్ ఆర్ధిక సహాయం అందిస్తోంది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం నాలుగేళ్లపాటు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడంలో జాప్యం చేసింది. దీంతో ఈ మొత్తాలు రూ.1,756 కోట్ల వరకు చేరగా, వాటన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. విద్యార్థుల సంక్షేమం కోసం పాతఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు, ఈబీసీ, వికలాంగులైన 13 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారు. కేంద్రం భరించాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీల రీయింబర్స్ మెంట్ పథకానికి అరకొరగా నిధులిస్తున్నది. 2018-19 విద్యాసంవత్సరంలో విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కోసం ప్రభుత్వం రూ.3,282 కోట్లు కేటాయించింది. 2020-21 ఫీజురీయింబర్స్ మెంట్ కోసం రూ.2650 కోట్లు కేటాయించింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం రూ.10,202.19 కోట్లు ఖర్చు చేసింది.
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను ప్రభుత్వం వివిధ శ్లాబు కేటగిరీల్లో 30 శాతం నుంచి 90 శాతం వరకు పెంచింది. ఈ మేరకు 2017 మార్చి 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పెంపుదలతో 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం మూడో తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు చెల్లించే రూ.750 రూ.950 వరకు, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చెల్లించే రూ.850 నుంచి రూ. 1,100 పెంచింది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ కళాశాల హాస్టల్లోని విద్యార్థులకు చెల్లిస్తున్న మెస్ చార్జీలను ప్రభుత్వం రూ.1,050 నుండి రూ.1,400 పెంచింది. కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్, డే స్కాలర్స్ విషయంలో 4 కేటగిరీల్లో 13 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు రూ.962 నుంచి రూ.1,500, పీజీ విద్యార్థులకు 682 నుంచి రూ. 1,500, డిగ్రీ విద్యార్థులకు రూ.580 నుంచి రూ.1,000, ఇంటర్మీడియెట్ వారికి రూ.520 నుంచి 750, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్ కు, డే స్కాలర్స్ కి ప్రొఫెషనల్ కోర్సులకు రూ.462 నుంచి రూ.680, పీజీ కోర్సులకు రూ.442 నుంచి రూ.650, డిగ్రీ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500, ఇంటర్ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500 వరకు మెస్ చార్జీలు పెరిగాయి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లలో దాదాపు 19 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. వీరికి అయ్యే భోజన ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాథం భరిస్తుంది. 9, 10 తరగతుల్లోని 4.73 లక్షల మంది విద్యార్థుల భోజన ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం వంట ఖర్చు ధర పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం 2019 మే 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలల్లో వంట ఖర్చు రూ. 4.13 నుంచి రూ. 4.35కు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ. 6.18 నుంచి రూ. 6.51కు, 9, 10 తరగతులకు కూడా రూ. 6.18 నుంచి రూ. 6.51కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 గుడ్డు ధరతో కలిపి ఉన్నత పాఠశాలల్లో రూ. 8.51కు పెంచింది. పెంచిన భోజన ధరలతో ప్రభుత్వంపై అధనంగా రోజుకు రూ.7 లక్షల అదనపు భారం పడుతుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలల ఆవరణలోనే కూరగాయలు, పండ్లు పండించి విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పాఠశాల ఆవరణలోనే 5 నుంచి 10 శాతం ఖాళీ స్థలాల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయనున్నారు. స్థలం లేకపోతే చిన్న తొట్లు, కుండీలు, పాత కుండీలతో పాటు పై కప్పులో మొక్కలు పెంచాలని నిర్ణయించారు.
రాష్ర్టంలోని ఎస్సీ కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకొనే విద్యార్థులకు వ్యక్తిగత ఖర్చులకోసం ప్రతినెలా పాకెట్ మనీ కింద ప్రభుత్వం రూ.500 అందిస్తోంది. ఎస్సీ కళాశాల హాస్టళ్ల నిర్వహణ వ్యయం కూడా పెంచింది.
పోస్ట్ మెట్రిక్ చదివే విద్యార్థులుండే హాస్టళ్ల నిర్వహణా వ్యయాన్ని ప్రతీ ఏటా పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికి రూ.4 వేలు వెచ్చిస్తుండగా, 2019-20 విద్యా సంవత్సరానికిగాను రూ.6 వేలకు పెంచారు. పోస్ట్మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులు వార్షికోత్సవం నిర్వహించుకునేందుకు రూ.20 వేలు ఏటా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉత్వర్వులు జారీ చేసింది.
హాస్టళ్ల విద్యార్ధుల రక్షణ కోసం సెక్యూరిటీ గార్డుల నియామకం
బాలికలకు భద్రత దృష్ట్యా హాస్టళ్లకు రక్షణ కోసం సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా పగలు, రాత్రి రెండు షిఫ్ట్ లలో రూ.10 వేల వేతనానికి పనిచేసేలా వాచ్మన్లను నియమిస్తున్నారు.
అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వేసవి సెలవుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమం అమలు చేయడానికి అధికారులు విధివిదానాలు తయారుచేస్తున్నారు. నిరక్షరాస్యుల తాజా సమాచారం కోసం గ్రామాలవారీగా నిరక్షరాస్యుల వివరాలను సేకరిస్తోంది. అందులో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది.
రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాన్ని (స్టయిఫండ్) పెంచింది. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ, పీజీడెంటల్, సూపర్ స్పెషాలిటీ విద్యార్థుల ఉపకార వేతనం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెరిగిన జీవనవ్యయం, అధికకాలం కఠినమైన వైద్యవిద్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. హౌస్సర్జన్ల (మెడికల్) స్టయిఫండ్ రూ.12,167 నుంచి రూ.19,589కు, హౌస్ సర్జన్ల (డెంటల్)కు రూ. 12,167 నుంచి రూ.19,589కు పెరిగింది. పోస్టు గ్రాడ్యుయేట్లకు తొలిఏడాది రూ.27,376 నుంచి రూ.44.075లకు, రెండో ఏడాది రూ. 28,897 నుంచి రూ. 46,524కు, మూడో ఏడాది రూ.30,418 నుంచి రూ.48,973కు, పీజీ (డిప్లొమా) స్టయిఫండ్ మొదటి ఏడాది రూ.27,376 నుంచి రూ.44,075కు, రెండో ఏడాది రూ.28,897 నుంచి రూ.46,524కు పెరిగింది. సూపర్స్పెషాలిటీ కోర్సులకు మొదటి ఏడాది రూ. 30,418 నుంచి రూ.48,973కు, రెండోఏడాది రూ.31,939 నుంచి రూ.51,422కు మూడో ఏడాది రూ.33,459 నుంచి రూ.53,869కు పెరిగింది. ఎండీఎస్ కోర్సులకు మొదటి ఏడాది రూ.27,376 నుంచి రూ.44,075కు, రెండో ఏడాది రూ.28,897 నుంచి రూ.46,524 కు, మూడో ఏడాది రూ.30,418 నుంచి రూ.48,973 వరకు పెరిగింది.
తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖలో పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కొత్త విద్యా సంవత్సరంలో కొత్త విద్యావిధానం అమల్లోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేసేలా వరంగల్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా విద్యాశాఖ ఎంపిక చేసి, అమలు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం.. పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో మండలానికి 4 స్కూళ్లను ఎంపిక చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న 51 మండలాల్లోని 462 పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మార్చేందుకు కావాల్సిన అన్నిఏర్పాట్లు చేశారు.
మెడిసిన్ లో పీజీ పూర్తిచేసిన విద్యార్థులు ఖచ్చితంగా ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేయాలన్న నిబంధనను తొలగిస్తూ 2018 మార్చి 8న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ దవాఖానల్లో చాలినంత సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తున్నందున, మెడికల్ విద్యార్థులతో పనిచేయించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించింది. ఈ నిర్ణయాన్ని 2018 నుంచే అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరంలో పీజీ పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేయకున్నా, వారి విద్యార్హతలను రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఉన్నత ప్రమాణాలతో సర్కార్ విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం 2016 నవంబర్ 16న డిజిటల్ తరగతులను ప్రారంభించింది. డిజిటల్ తరగతులపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలోని 3 వేలకు పైగా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి. 50 ఏండ్లలో సాధించిన దానిని సాంకేతిక పరిజ్ఞానంతో 10 ఏండ్లలో సాధించవచ్చని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. 2017-18 సంవత్సరంలో 5,343 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను అమలు చేస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొనిరావడమే లక్ష్యంగా డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన టీవీ స్టూడియో ద్వారా ఈ డిజిటల్ తరగతుల ప్రసారాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో లైవ్ టీచింగ్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మొదటగా 50 పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టూడియో ద్వారా ఈ -పాఠ్యాంశ బోధన మొదలు పెట్టారు. ఈ విధానాన్ని మరింత ఆధునీకరిస్తూ పాఠ్యాంశ బోధనను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. నేరుగా శాటిలైట్ లింకుతో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు. 200 రోజుల బోధన పరిమితితో 6 నుండి 7వ తరగతి వరకు సబ్జెక్టులను బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టూడియో నుంచి పాఠ్యాంశ బోధన చేస్తారు. ఈ వీడియో పాఠశాలల్లోని స్క్రీన్ పై లైవ్ డిస్ప్లే అవుతుంది. ప్రతీ విద్యార్ధి దగ్గర ఓ బజర్ ఉంటుంది. విద్యార్ధులకు ఏవైనా సందేహాలు వస్తే ఆ బజర్ నొక్కుతారు. అప్పుడు వారిని లైవ్ లోకి తీసుకొని వారి సందేహాన్ని తీరుస్తారు.
వసతిగృహాల్లోని విద్యార్థుల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. విశ్వదర్శిని పేరిట ప్రతిభావంతులైన విద్యార్థులను విదేశీ పర్యటనలకు తీసుకెళ్తోంది. అంతేకాదు.. అక్కడ వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్తో పాటు సంబంధిత అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు తయారీకి సహకరించనుంది. పర్యటనలో భాగంగా సందర్శించిన సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వనుంది. ఇదంతా విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటన వినోదాత్మకంగా కాకుండా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడం, సరికొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి తోడ్పాటవుతుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పోస్టుమెట్రిక్ హాస్టళ్లలోని ఆసక్తిగల విద్యార్థులను షార్ట్లిస్ట్ చేసింది. మొత్తం 100 మంది ఆసక్తి చూపగా.. వారిలో నుంచి 18 మందిని ఎంపిక చేసింది. తొలివిడత వీరిని విశ్వదర్శిని పర్యటనకు సిద్ధం చేసి, రూ.28 లక్షలు విడుదల చేసింది.
విశ్వదర్శిని కార్యక్రమంలో భాగంగా ఐదు దేశాల్లో విద్యార్థులు పర్యటించనున్నారు. ఫిన్లాండ్, గ్రీస్, పోలెండ్, టర్కీతో పాటు చైనాకు వెళ్లనున్నారు. నాలుగు వారాలపాటు సాగే ఈ టూర్లో విద్యార్థులు వారి సబ్జెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల రూపకల్పన, సంబంధిత సంస్థల సందర్శన చేపడతారు. అదేవిధంగా ప్రాజెక్టుపై ఇంటర్న్షిప్ సైతం చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పర్యటన అనంతరం సంక్షేమ శాఖ, సంబంధిత సంస్థ సర్టిఫికెట్లు ఇవ్వనుంది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి తదితర పథకాల అర్హుల ఎంపికలో ఈ సర్టిఫికెట్లను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రామాణికంగా తీసుకోనుంది. ప్రభుత్వ సాయంతో పాటు ఎంపికైన విదేశీ యూనివర్సిటీల్లో ఈ విద్యార్థులకు ఫీజు రాయితీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పర్యటనతో విద్యార్థులకు వివిధ దేశాలు, సంస్కృతులపై అవగాహన ఏర్పడటంతో పాటు నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుంది.
ఆన్లైన్ విద్యను ప్రారంభించాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చాలామంచిదని, దేశంలో అన్ని రాష్ర్టల కన్నా ముందుగా తెలంగాణ సర్కా రు తీసుకున్న చొరవను అభినందిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చెప్పారు. 2020 ఆగస్టు 25న వరంగల్ నిట్ ‘ఆన్లైన్ విద్య- అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థ్ధాయి వెబినార్లో గవర్నర్ మాట్లాడారు. దేశంలోని మిగతా రాష్ర్టాలు కూడా తెలంగాణను అనుసరించాలని సూచించారు.
విద్యార్థులకే కాకుండా శిక్షకులకు కూడా ఏరోస్పేస్ రంగంలో శిక్షణ ఇచ్చేలా ప్రపంచ ప్రఖ్యాత ఎంబ్రిరిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం (ఇఆర్ఏయూ)తో తెలంగాణ నైపుణ్య విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్) ఒప్పందం చేసుకుంది. 2016 ఫిబ్రవరి 19న సింగపూర్లో జరిగిన కార్యక్రమంలో ఇఆర్ఏయూ ఆసియా అధినేత ఆచార్య గ్రాహం హంట్, టాస్క్ సీఈవో సుజీవ్ నాయర్ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకాలు చేశారు. భారత్లో ప్రధానంగా తెలంగాణలోని యువతరానికి ఏరోస్పేస్ రంగంలో నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇవ్వటం ఈఒప్పందం ప్రధాన ఉద్దేశం. విద్యాప్రణాళిక రూపకల్పన, బోధనా పద్ధతులు, ప్రణాళిక, విద్యార్థులకే కాకుండా శిక్షకులకు కూడా శిక్షణ ఇవ్వటం, కెరీర్ కౌన్సెలింగ్ అంశాల్లో ఏఆర్ఏయూ టాస్క్ కు తోడుగా నిలుస్తుంది. ఏరోస్పేస్ రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయంగా ఈఆర్ఏయూను పరిగణిస్తారు.
ఏరోస్పేస్ రంగంలో ఎదురయ్యే సమస్యలకు ఈ విశ్వవిద్యాలయం పరిష్కారాలను సూచిస్తుంటుంది. ఏరోస్పేస్ రంగంలో 80కి పైగా గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్డీ దాకా వివిధస్థాయి కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందజేస్తుంది. కేవలం అమెరికాలోనే కాకుండా 150 దేశాల్లోనూ ఆన్లైన్ ద్వారా తమ కోర్సులు నడుపుతోంది. హైదరాబాద్లో ఏరోస్పేస్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రంగంలో స్థానిక యువతరానికి ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాభివృద్ధి చేయటానికి టాస్క్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏవియేషన్ రంగంలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు మారాయి. పాత నైపుణ్యాలతో ఈ రంగంలో నిపుణులను తయారు చేయలేమనే సంగతిని పరిశ్రమ గుర్తించింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో టెక్నీషియన్స్, ఇన్స్ట్రక్టర్స్, ఇంజినీర్లు, శాస్త్రవేత్తల నైపుణ్య స్థాయిని పెంచటానికి ఈ ఒప్పందం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వరంగల్ లో 100 ఎకరాల్లో వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాలను స్థాపించేందుకు నిర్ణయించిన రాష్ట్ర మంత్రివర్గం 2016 జూన్ 3న ఆమోదం తెలిపింది. వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూర్లో పీవీ నరసింహారావు తెలంగాణ పశు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వెటర్నరీ కాలేజీని 24 సెప్టెంబర్, 2018న ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ పోస్టుల నియామకం చేపట్టనున్నారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా పాలెంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ ఆవరణలో వ్యవసాయ కళాశాలను రూ.107 కోట్ల వ్యయంతో నిర్మించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం(కేవీకే)కు అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిద్దామని సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే శంకర్నాయక్కు హామీఇచ్చారు. ప్రగతిభవన్లో 2020 జూలై 30న సీఎం కేసీఆర్ను కలిసిన శంకర్నాయక్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరుచేయాలని కోరారు. మల్యాల కేవీకే కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్చాన్స్లర్ జే రఘోత్తంరెడ్డి 160 ఎకరాల భూమిని, కోటిరూపాయలను విరాళంగా ఇచ్చారని సీఎం కేసీఆర్కు వివరించారు. కేవీకేకు అనుబంధంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరుచేయాలని కోరారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
నూతన జాతీయ విద్యావిధానం ద్వారా తెలంగాణ ఉన్నత విద్యాహబ్గా ఎదగడానికి, ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా వృద్ధి సాధించడానికి అపార అవకాశాలున్నాయని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మాహబ్గా, ఐటీ హ బ్గా, బయోటెక్నాలజీహబ్గా ఖ్యాతి గడించిందని గుర్తుచేశారు. ‘పర్స్స్పెక్టివ్ ఆన్ ఎడ్యుకేషన్ పాలసీ 2020-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అంశంపై విద్యారంగ నిపుణులతో 13 ఆగస్టు 2020న గవర్నర్ వెబినార్ నిర్వహించారు.
యూపీఎస్సీ, టిఎస్పిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం పేద విద్యార్థులకు భారంగా మారింది. పైగా మంచి శిక్షణకు హైదరాబాద్లో తప్ప ఇతర చోట్ల స్టడీ సర్కిళ్లు లేవు. అందుకే ప్రభుత్వం జిల్లాస్థాయిలోనే ఎస్సీ,ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీలకు 1, ఎస్టీలకు 4, బీసీలకు 9 స్టడీ సర్కిళ్లు వుండేవి. వీటి నిర్వహణకు రూ. 22 కోట్లు ఖర్చు చేశారు. పాత వాటితో కలుపుకొని రాష్ట్రంలో ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, బిసి లకు 10, మైనారిటీలకు 1 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు అయ్యాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం రూ. 253.91 కోట్లు ఖర్చు చేసింది. వివిధ అంశాలపై శిక్షణతోపాటు వసతి, భోజనం, గ్రంథాలయం, కంప్యూటర్లు, ఇంటర్నెట్, పుస్తకాల కొనుగోలు నిధి వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.
వరంగల్ నగరంలో కాళోజీ నారాయణ రావు పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం 2014 సెప్టెంబర్ 25న సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. దీంతో తెలంగాణలోని వైద్య కళాశాలలన్నీ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధి నుంచి వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయి. ఇందుకోసం 2016 ఫిబ్రవరి 9న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారంగా 27 అలోపతి (మోడరన్ మెడిసిన్) మెడికల్ కాలేజీలు (3950 అండర్ గ్రాడ్యుయేట్-యూజీ సీట్లు, 1408 పీజీ సీట్లు, 90 సూపర్ స్పెషాలిటీ సీట్లు), 12 డెంటల్ కాలేజీలు (1140 యూజీ, 278 పీజీ సీట్లు), 5 హోమియోపతి కాలేజీలు (450 యూజీ, 30 పీజీ సీట్లు), 2 ఆయుర్వేద కాలేజీలు (200 యూజీ, 38 పీజీ సీట్లు), 1 నేచురోపతి కాలేజీ (30 యూజీ సీట్లు), 2 యునానీ కాలేజీలు ( 175 యూజీ, 48 పీజీ సీట్లు), 77 నర్సింగ్ కాలేజీలు ( 4230 యూజీ, 383 పీజీ సీట్లు), 20 బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కాలేజీలు (680 యూజీ సీట్లు), 16 ఫిజియోథెరపీ కాలేజీలు (850 యూజీ-బీపీటీ సీట్లు, 112 పీజీ-ఎంపీటీ సీట్లు)తోపాటు న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ కాలేజీలు, ఉద్యోగులు కూడా కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోకి వస్తారు.
రాష్ట్ర వైద్య విద్యను మరింత అభివృద్ధి చేయడం కోసం కొత్తగా నాలుగు వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండలలో వీటిని ఏర్పాటు చేసింది. ఈ ఫైలుపై సీఎం కేసీఆర్ 22 మే, 2018న సంతకం చేశారు. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున సీట్లు కేటాయించారు. దీనికి అనుబంధంగా 750 పడకల ఆసుపత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. అలాగే, హైదరాబాద్ సనత్ నగర్ లో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ కూడా ప్రారంభమైంది. దీంతో మరో 100 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 7 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 30.5.2021న నిర్ణయించింది. ఇవి మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో ఏర్పాటు కానున్నాయి.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా వరంగల్ ఎంజీఎం దవాఖాన
వరంగల్ నగరంలోని ఎంజీఎం దవాఖానాను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 30.5.2021న నిర్ణయించింది. ఇందుకు తగినంత స్థలం లేకపోవడంతో వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి, ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ లో 2019 ఆగస్టు నుంచే ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండగా, డిసెంబర్ 4న అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 200 ఎకరాల్లో నిర్మించి ఎయిమ్స్ లో రోగులకు 1000 పడకల ఆస్పత్రి సౌకర్యంతోపాటు, ఎంబీబీఎస్ విద్యార్థులకు 50 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలోని గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు దిశగా కేంద్రం తమ పనులను ప్రారంభించింది. జనవరి 2019న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం సభ్యులు ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ వద్ద భూములను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనుల ఉపాధికి మార్గం చూపే ప్రత్యేక కోర్సులను మంజూరు చేయాలని ప్రభుత్వం వారిని కోరింది. సీఎం కేసీఆర్ కోరిక మేరకు 5 కోర్సుల్లో ఒక్కోదానిలో 30 సీట్ల చొప్పున మొదటి బ్యాచ్ తరగతులు ప్రారంభించనున్నారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ సైనిక్ స్కూల్ను వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తిలో 53.16 ఎకరాల్లో నెలకొల్పనున్నారు. సైనిక్ స్కూల్ స్థాపన కోసం 2017 మార్చి 2న కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎం.ఓ.యూ.పై సంతకాలు చేశాయి. నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఒక వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డి.పి.ఆర్.) సిద్ధం చేసింది. భవనాల నిర్మాణానికి, ఇతర సామగ్రి, పరికరాలకు రూ.100 కోట్లతో డిపిఆర్ ను సిద్ధం చేయగా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సైనిక్ స్కూల్ కి భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.4 కోట్లను విడుదల చేసింది.
రాష్ట్రంలో 32 కేంద్రీయ విద్యాలయాలు, 9 జవహర్ నవోదయ కేంద్రాలున్నాయి. కొత్తగా మరో 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. నిజామాబాద్ టౌన్, భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నిజామాబాద్ రుద్రూరులో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీని ఏర్పాటు చేయాలని 2015 జూన్ 10న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టెక్నాలజీలో వాల్యూ యాడింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, సీడ్ ప్రాసెసింగ్, డ్రైయింగ్, ఫ్రీజింగ్ తదితర పద్ధతుల ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయి. కాగా, రుద్రూరులో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫుడ్ సైన్స్ కాలేజీని 2017 ఆగస్టు 30న ప్రారంభించారు. దేశంలోనే ఇది 13వ ఫుడ్ సైన్స్ కాలేజీ.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం పడిగల్ గ్రామంలో స్పైసెస్ పార్కు (సుగంధ ద్రవ్యాల పార్కు)ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయాలని 2016 మార్చి 21న ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని పసుపు ఇతర సుగంధ ద్రవ్యాల రైతులకు బాసటగా ఈ స్పైసెస్ పార్క్ ఉండనుంది. దీనికి రూ.30.81 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. స్థల సేకరణ కూడా జరిగినందున పడిగల్ గ్రామంలో రైల్వే లైనుకు, హైవే పక్కనున్న స్థలంలోనే స్పైసెస్ పార్కు ఏర్పాటు చేయడానికి పనులు జరిపిస్తున్నారు.
హైదరాబాద్ శివారు సుల్తాన్పూర్లోని వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. రూ.250 కోట్ల పెట్టుబడితో మూడు వేల మందికి ఉపాధి కల్పించేందుకు సంస్థ ముందుకొచ్చింది. దీనికి 1 సెప్టెంబర్, 2019న శంకుస్థాపన చేశారు. వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులో 11 పరిశ్రమల నిర్మాణం జరుగుతోంది. తాజాగా సహజానంద్ వైద్య సాంకేతిక సంస్థ ముందుకొచ్చింది. గుండె శస్త్రచికిత్సలకు స్టెంట్లకు భారీగా డిమాండ్ ఉంది. కొత్త పరిశ్రమ ఏర్పాటుతో స్టెంట్ల ఉత్పత్తికి తెలంగాణ కేంద్రస్థానం కానుంది.
గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన విద్యాహబ్ దేశానికే తలమానికంగా నిలువ బోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణలో అన్నిరకాల విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలను ఒకే క్యాంపస్లో నిర్మించిన ఘనత దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది.
గజ్వేల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యాహబ్ను నిర్మించారు. దానికి ఒక కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యాహబ్ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 4,58,902 చదరపు అడుగులు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో, ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతోపాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు. విశాలమైన తరగతి గదుల్లో పగటివేళల్లో కరంట్ లైట్ ఎక్కువ అవసరం లేనివిధంగా భవనాలను నిర్మించారు.
అన్ని తరగతుల వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబులు రూపొందించారు. ఉత్తమ బోధనతోపాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాట్లు చేశారు. 1,200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి క్యాంపస్లో 2,500 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో మరో 1,000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్లో చదుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచస్థాయికి ఎదిగేలా విద్యాబోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావాల్సిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సిలబస్ను కొనసాగిస్తున్నారు.
నిర్మాణాలు, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.28 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో విద్యాహబ్లు నిర్మించేందుకు చర్యలు ప్రారంభించారు.
రాష్ట్రంలోని 10 విశ్వ విద్యాలయాలకు కొత్త వీసీల నియామకం : (22 మే 2021)
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను చేపట్టి కొందరి పేర్లను సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ 22 మే 2021న ఆమోదముద్ర వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతించగా, తొలిసారిగా ప్రైవేటురంగంలో మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రారంభమైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వర్సిటీ లోగో, బ్రోచర్, వెబ్సైట్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ 24 జూన్ 2020న ఆవిష్కరించారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచే ఎనిమిది కొత్త కోర్సులతో యూనివర్సిటీ ప్రారంభంకానున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్లెర్నింగ్, ఇంటర్నెట్ థింకింగ్, బ్లాక్చైన్ టెక్నాలజీ, డాటా సైన్స్ అండ్ డాటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్వర్క్స్, మల్టీమీడియా టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ వంటి కోర్సులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. రొబోటిక్స్, వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీతోపాటు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ వంటి కోర్సులను కూడా అందించనున్నట్టు వివరించారు.
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలలో డిజిటల్ పాఠాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నిరకాల పాఠశాలల్లో ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను అమలుచేయాలని సీఎం కేసీఆర్ నేతృత్వంతో 5 ఆగస్టు 2020న సమావేశమైన క్యాబినెట్ తీర్మానించింది. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలలో ఆన్లైన్/డిజిటల్ పాఠాలను అందించాలని నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నష్టపోకుండా కాపాడినట్లయ్యింది. టీశాట్, యాదగిరి, ఇతర టీవీ చానెళ్లు/ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థులకు డిజిటల్ పాఠాలను అందుబాటులోకి తెచ్చారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్తోపాటు ఇతర వృత్తి విద్యా కాలేజీలలో కూడా ఆన్లైన్/డిజిటల్ పాఠాలను అందిస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా మూతబడిన పాఠశాలలను ప్రభుత్వం 01 సెప్టెంబర్, 2020 నుంచి ప్రారంభించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి డిజిటల్ బోధన ద్వారా నూతన విద్యాసంవత్సరం ప్రారంభం చేశారు. దీంతో 27 ఆగస్టు నుంచి టీచర్లు, జూనియర్ కళాశాలల లెక్చరర్లు పాఠశాలలకు, కళాశాలలకు హాజరయ్యారు. కరోనా ఉదృతి నేపథ్యంలో సెప్టెంబర్ 11 నుంచి 20వ తారీఖు వరకు టీచర్లు, లెక్షరర్లు ఇంటి వద్దనుంచే ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో అద్యాపకులు ఇంటివద్దనుంచే క్లాసెస్ నిర్వహించారు. తిరిగి 21 సెప్టెంబర్ నుంచి టీచర్లు 50 శాతం హాజరుతో పాఠశాలలకు హాజరయ్యి ఆన్ లైన్ క్లాసైస్ నిర్వహిస్తున్నారు. డిజిటల్ క్లాసుల తరువాత విద్యార్ధులకు వచ్చిన సందేహాలు తీర్చడానికి టీచర్లు ఫోన్లు చేయడంతో పాటు వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వర్క్ షీట్లను పరిశీలిస్తున్నారు.