ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావన. ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహ పూర్వకంగా ఉండాలని నిర్ణయించారు. తెలంగాణలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుస్తున్నది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. చీటికి మాటికి ఉద్యోగులను వేధించే సంకుచితత్వాన్ని ప్రదర్శించవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వేతన పెంపుదలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా వున్నది. రాష్ట్రంలో మొత్తం 6,48,560 మంది ప్రభుత్వోద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి జీతాలకు ప్రభుత్వం రూ.39,121 కోట్లు ఖర్చు చేస్తున్నది. అదే 2013-14 లో వీరి జీతాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.17,130 కోట్లు మాత్రమే ఖర్చు చేసేది. 2013-14 తో పోల్చుకుంటే 2019-20 నాటికి వీరి జీతాలు 128.37 శాతం పెరిగాయి. హోంగార్డులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, అంగన్ వాడీలు ఉద్యోగులు, ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, విద్యా వాలంటీర్లు, వీఆర్ఏలు, పార్ట్ టైం,ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులు, సెర్ఫ్ ఉద్యోగులు మొత్తం అందరూ కలిపి 2,27,782 మంది ఉద్యోగుల వేతనాలకు సంవత్సరానికి రూ.1023.43 కోట్ల ఖర్చు చేస్తున్నారు. అలాగే ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ దవాఖానాల్లో నగదురహిత వైద్యం అందుబాటులోకి తెచ్చింది. వెల్ నెస్ సెంటర్ల ద్వారా ఉద్యోగులకు ఓ.పీ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
1. ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సకల జనుల సమ్మె లాంటి అధ్బుత పోరాటాలు చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం 2014 ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు జీతంతోపాటు ఈ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చింది.
2. సకల జనుల సమ్మె కాలం ప్రత్యేక సెలవు
సకల జనుల సమ్మె కాలం విషయంలో ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటూ సకల జనుల సమ్మె కాలాన్నిప్రత్యేక క్యాజువల్ లీవ్గా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2016 జనవరి 2న ఉత్తర్వులుజారీ చేసింది. 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు 42 రోజులపాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు.
3. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించింది. తెలంగాణ ఉద్యోగులకు మూల వేతనంలో 43% శాతం మేర పెంచి (ఫిట్మెంట్) ఇచ్చింది. ఈ మేరకు వేతన సవరణను ఖరారు చేసింది. నగదు ప్రయోజనం తెలంగాణ ఆవిర్భావ దినమైన 2014 జూన్ 2వ తేదీ నుంచి అమలు అయింది. అప్పటి నుంచి 8 నెలల బకాయిలు ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యాయి.
4. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మరో 5 క్యాజువల్ లీవులు
మహిళా ఉద్యోగినులకు ఇపుడున్న సాధారణ సెలవులు (సీఎల్స్), ఐచ్ఛిక సెలవులకు అదనంగా మరో ఐదు సీఎల్స్ తీసుకునే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తేదీ.1.9.2018 రోజున ఉత్తర్వులు జారీ చేసింది.
5. 130 మంది ఎంపీడీఓలకు తొలిసారిగా పదోన్నతులు
మండల వ్యవస్థ ఏర్పాటైన 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎంపీడీవోలకు సీఎం కేసీఆర్ అనూహ్యమైన వరమిచ్చారు. గ్రామాల అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని గుర్తిస్తూ.. వారికి అడుగకుండానే పదోన్నతులు కల్పించారు. తేదీ 3 సెప్టెంబర్ 2018 రోజున ఎంపీడీవో అసోసియేషన్ నేతలను కేసీఆర్ స్వయంగా తన ఇంటికి పిలిచారు. 130 మంది ఎంపీడీవోలకు సీనియర్ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పిస్తూ సంబంధిత ఫైల్పై సంతకం చేశారు. దీంతో వీరంతా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు చెందిన 6 విభాగాల్లోని కీలక పోస్టులకు అర్హులవుతారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో, సీఈవో, డీఆర్డీవో తదితర పోస్టులతోపాటు పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధిశాఖ కమిషనర్, ఫైనాన్స్ కమిషనర్, ఈజీఎం అదనపు ప్రాజెక్టు డైరెక్టర్, సంయుక్త పీడీ తదితర పలు సీనియర్ పదవులను చేపట్టేందుకు అర్హత లభిస్తుంది.
6. సీపీఎస్ ఉద్యోగులకు డెత్ & రిటైర్మెంట్ బెనిఫిట్స్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు డెత్కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని చెల్లించేందుకు వీలుగా 2018 మే 23న రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. సీపీఎస్ 2004 సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చింది. సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ -1972, రివైజ్డ్ పెన్షన్ రూల్స్ -1980 ప్రకారం సీపీఎస్ ఉద్యోగులకు డెత్కమ్ రిటైర్మైంట్ బెనిఫిట్స్ అందించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 498 మంది మరణించిన కాంట్రిబ్యూటరీ ఉద్యోగుల కుటుంబాలకు, రిటైర్డ్ అయిన 990మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు అందనున్నాయి.
7. మొదటి వేతన సవరణ సంఘం (పి.ఆర్.సి.) ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి పీఆర్సీ కమిటీని ప్రభుత్వం 2018 మే నెలలో నియమించింది. పీఆర్సీ కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ సీఆర్ బిశ్వాల్ వ్యవహరిస్తున్నారు. పెరిగిన జీవన ప్రమాణాల ప్రకారం ఉద్యోగులకు ఏ మేరకు వేతనాలను పెంచాలనే విషయమై ఉద్యోగ సంఘాలు ఈ కమిటీకి విన్నవించుకుంటాయి. ఆయా సంఘాలతో చర్చించిన అనంతరం ఈ పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేస్తుంది.
8. స్థానికులకు ఎక్కువ అవకాశాలే లక్ష్యంగా కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు
తెలంగాణ ప్రజలకు గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో నూతనజోనల్, మల్టీ జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేస్తూ 2018 మే 24న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనంచేకూరేలా, గతంలో జరిగిన అన్యాయాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు ఉండేలా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, రాష్ట్రంలో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకొన్నందున ఆయా ప్రాంతాల్లోని స్థానికులే 95 శాతం అవకాశం దక్కేవిధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. జోన్లకు రాష్ట్రంలో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాల పేర్లను ఖరారుచేశారు. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.
కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన కొత్త జోనల్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి, రాష్ట్రపతికి పంపింది. ఈ మేరకు తేదీ 30 ఆగస్టు 2018 రోజున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసి ఆమోదించారు. దీంతో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలులోకి వచ్చింది. ఇకపై ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు చదివిన వారినే స్థానికులుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో జరిగే అన్ని విద్య, ఉద్యోగ నియామకాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ల అమలు చేస్తారు.
95శాతం రిజర్వేషన్లు ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు
ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ విద్య, ఉద్యోగాల్లో స్థానికత 85శాతానికి మించి లేదు. దేశంలో తొలిసారిగా 95శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకెక్కింది.
కాళేశ్వరం, బాసర, రాజన్న, భదాద్రి (1.61 కోట్ల జనాభా)
యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ (1.88 కోట్ల జనాభా)
9. ఉద్యోగులకు ఇన్సెంటివ్ అవార్డులు
తెలంగాణ స్టేట్ ఎంప్లాయ్ ఇన్సెంటివ్ స్కీం ఫైలుపై ముఖ్యమంత్రి 2017 ఆగస్టు 11న సంతకం చేసి ఆమోదం తెలిపారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 12 మంది ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించింది. వీరికి 2017 ఆగస్టు 15న గోల్కొండలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అవార్డులను ప్రధానం చేశారు. మొదటి బహుమతి గ్రహీతకు రూ.5 లక్షలు, రెండో బహుమతి గ్రహీతకు రూ.3 లక్షలు, మూడో బహుమతి గ్రహీతకు రూ.2 లక్షలు అందించారు. 4 తరగతికి చెందిన ముగ్గురు ఉద్యోగులకు ఈ అవార్డు అందజేశారు.
10. ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే పెన్షన్
మూడు, నాలుగు దశాబ్దాలపాటు ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు సేవలందించి పదవీ విరమణ చేసే ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ రోజునే పూర్తి పెన్షన్ అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రిటైరైన ఉద్యోగిని అదేరోజు ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకూ పంపించి రావాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
11. టీ యాప్ ద్వారా పదవీ విరమణ ఉద్యోగులకు జీవన దృవీకరనపత్రం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి.. పదవీ విరమణ చెంది పింఛన్ అందుకుంటున్న వారు ఏటా ఒకసారి వారు సజీవంగా ఉన్నట్లు జీవన ధ్రువీకరణ పత్రం (లైఫ్ సర్టిఫికెట్)ను అందివ్వాల్సి వుంటుంది. దీన్ని పింఛను చెల్లింపు అధికారి (పీపీవో)కి ఇవ్వాలి. పీపీవో లేదా పింఛను డబ్బులు జమ అవుతున్న బ్యాంకు బ్రాంచి మేనేజర్ సదరు ఉద్యోగి సజీవంగా ఉన్నట్లు, తనవద్దకు ప్రత్యక్షంగా వచ్చి సంతకం చేసినట్లు ధ్రువీకరణ పత్రం ఇస్తేనే ఆ తర్వాత సంవత్సరానికి పింఛను జారీ అయ్యేది. లేనిపక్షంలో మాజీ ఉద్యోగి బతికి ఉన్నట్లు కాదు అని ప్రభుత్వం భావించేది. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ టీ యాప్ ద్వారా నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పాత విధానాలకు స్వస్తి పలుకుతూ.. ఆధునిక సాంకేతికతను మేళవించి పింఛనుదారులకు సాయం చేసే విధానం అందుబాటులోకి తెచ్చింది. ఇక ధ్రువపత్రం అవసరం లేకుండా.. ఇంట్లో నుంచే మొబైల్ ఫోన్లో టీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిద్వారా ఫించన్ దారుడు తన ఫొటో తీసుకుని.. దరఖాస్తును భర్తీ చేస్తే సరిపోతుంది. సదరు మాజీ ఉద్యోగి సజీవంగానే ఉన్నట్లు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తర్వాత నుంచి బ్యాంకు ఖాతాకు నెలవారీగా పింఛను జమ చేస్తుంది. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ఫించనుదారులున్నారు.
12. కారుణ్య నియామకాలు
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాల్లో మానవత్వంతో వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. చనిపోయిన సందర్భంలో ఉద్యోగి కుటుంబం ఎంతో బాధతో, కష్టంతో ఉంటుంది. కావున వారిని ఉద్యోగ నియామకం కోసం రోజులు, నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా, వారి అర్హతనుబట్టి పదిరోజుల్లోగా ఉద్యోగంలో నియమించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వయస్సు, విద్యార్హతల విషయంలో మినహాయింపులివ్వాలని నిర్ణయించింది. కలెక్టర్లకు ఈ అధికారాలు బదలాయించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.
13. ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్నెస్ సెంటర్స్
ప్రభుత్వ ఉద్యోగులు ఎంప్లాయీస్ హెల్త్స్కీం(ఈహెచ్ఎస్)కార్డుతో, జర్నలిస్టులు జేహెచ్ఎస్ కార్డులతో ప్రభుత్వ, కార్పొరేట్ దవాఖానల్లో వైద్యసేవలు పొందేవారు. అయితే వారికోసం ప్రత్యేక కౌంటర్లు లేకపోవడంతో అనుమతుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. చాలాసార్లు పడకలు అందుబాటులో లేవని కార్పొరేట్ దవాఖానలు వైద్యానికి నిరాకరించేవి. వృత్తిరీత్యా సమయాభావం వల్ల పలువురు సొంత డబ్బులతో ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించేవారు. మరికొందరు వైద్యానికి దూరంగా ఉండేవారు. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఉద్యోగులు, జర్నలిస్టులు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న కార్పొరేట్ దవాఖానల్లో నగదురహిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) కింద సేవలు అందించేందుకు మొదటగా నగరంలోని 14 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది.
2016 డిసెంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం ఖైరతాబాద్లో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించింది. ఒకేచోట అన్ని రకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించిన మీదటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లతో ఒప్పందాలు చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్ పేరుతో ఓపీ సేవలను కూడా ప్రారంభించింది. తదుపరి చికిత్స కోసం వెల్నెస్ సెంటర్ పరిధిలోని తమకు ఇష్టమైన దవాఖానలో నేరుగా చేరి, నగదు రహిత చికిత్స పొందే వెసులుబాటు లభించింది. వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసినప్పటినుంచి సుమారుగా 6 లక్షల మంది ఓపీ సేవలను వినియోగించుకున్నారు. మరోవైపు ఇతర దవాఖానలపై కూడా ఒత్తిడి తగ్గింది.వీటి పనితీరును ఇతర రాష్ట్రాలు ఆరాతీస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకంగా నిలిచింది. 2016 డిసెంబర్ లో హైదరాబాద్లోని ఖైరతాబాద్లో మొట్టమొదటి వెల్నెస్ సెంటర్ను, 2017 ఫిబ్రవరి 2న వనస్థలిపురంలో రెండో సెంటర్ను ఆ తర్వాత వరంగల్లో మూడో సెంటర్ను ప్రారంభించారు. లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వైద్యసేవల విస్తరణపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా సంగారెడ్డి, కరీంనగర్లో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. కూకట్పల్లి, మహబూబ్నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్లో కూడా ఈ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఖమ్మంలో ఒకటి, హైదరాబాద్లో రెండుచోట్ల వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్యశాఖ కసరత్తు చేస్తున్నది. ఉద్యోగుల, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి 2018-19 బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. 2020-21 బడ్జెట్లో రూ.410 కోట్లు కేటాయించారు.
– ఈ కేంద్రాల్లో శస్త్రచికిత్సలు చేయించుకున్నవారి సంఖ్య 1.64 లక్షలు. ఇందులో గుండె సంబంధ శస్త్రచికిత్సలు 10,050, కిడ్నీ సంబంధమేనవి 6,070, కంటి ఆపరేషన్లు-43,571, మెడికల్ అంకాలజీ-5,861, ఆర్థోపెడిక్ 4,351 ఆపరేషన్లు జరిగాయి.
– ముందుగా వెల్నెస్ సెంటర్లలో ఓపీ సేవలు పొందాల్సి ఉంటుంది. అక్కడ అందుబాటులోలేని పరీక్షలను ఇతర దవాఖానలకు రిఫర్ చేస్తూ వైద్యులు ప్రిస్కిప్షన్ ఇస్తారు. రోగులు వెల్నెస్ సెంటర్ పరిధిలోని దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు.
– వెల్నెస్ సెంటర్ల పరిధిలో 300 ప్రభుత్వ,ప్రైవేట్ దవాఖాలు ఉన్నాయి. ఇందులో నిమ్స్, ఉస్మానియా, గాంధీ తదితర సూపర్ స్పెషాల్టీ దవాఖానలున్నాయి. శస్త్రచికిత్స కోసం రిఫర్ చేస్తూ రాసే ప్రిస్కిప్షన్లో దవాఖాన పేరు ఉండదు. రోగి నచ్చిన దవాఖానలో చేరవచ్చు.
అత్యాధునిక ల్యాబ్లో 50 రకాల పరీక్షలు
ఖైరతాబాద్,వనస్థలిపురం వెల్నెస్ సెంటర్లలో 50 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసీజీ, 2డీ-ఈకో, అల్ట్రాసౌండ్, థైరాయిడ్ ప్రొఫైల్, ఎక్స్-రే, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు, సీబీపీ, ఈఎస్ఆర్, కొలెస్ట్రాల్, వీడీఆర్ఎల్, హెచ్ఐవీ, యూరిన్ కల్చర్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుబాటులో లేని పరీక్షల కోసం ఇతర దవాఖానలకు రిఫర్ చేస్తున్నారు.
అందుబాటులో 15 విభాగాలు
వెల్నెస్ సెంటర్లలో మొత్తం 15 విభాగాలు అందుబాటులో ఉన్నాయి. జనరల్ మెడిసిన్,డెంటల్,ఆప్తమాలజీ(కంటివైద్యం),గైనకాలజీ,ఆర్థోపెడిక్,అంకాలజీ,నెఫ్రాలజీ,పల్మనాలజీ,ఈఎన్టీ,డయాబెటాలజీ,హోమియోపతి,ఆయుర్వేదిక్,యునానీ,ఫిజియోథెరపీ,యోగా విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. ఓపీ,వైద్య పరీక్షలు చేస్తారు. శస్త్రచికిత్సలు,తదుపరి వైద్యం కోసం ఇతర దవాఖానలకు రిఫర్ చేస్తారు. సెలవులతో నిమిత్తం లేకుండా వెల్నెస్ సెంటర్లు పనిచేస్తున్నాయి.
ఇక్కడ 1,885 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయడంతోపాటు,200 రకాల ప్రముఖ కంపెనీల మందులను కూడా ఉచితంగా అందిస్తారు. గుండె, కిడ్నీలు, లివర్, సర్జికల్, క్యాన్సర్ తదితర కీలకమైన ఆపరేషన్లు, చికిత్సలకు ఇక్కడ వైద్యసేవలందుతాయి. హైదరాబాద్ లో మరో 4 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని పాత జిల్లా కేంద్రాల్లోనూ వీలైనంత తొందరగా వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. వెల్నెస్ సెంటర్లో ప్రధానంగా ఓపీ సేవలు అందుతాయి. ఇది రిఫరల్ సెంటర్గా కాకుండా ఓపీ సేవలందించే విషయంలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇక్కడే వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) కింద సేవల కోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. వెల్నెస్ సెంటర్ల అడ్రస్ తెలుసు కోవడంతో పాటు అందులోనే అపాయింట్మెంట్ బుకింగ్, ఈ- హెల్త్ రికార్డ్స్ తదితర సేవలు పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం ఈహెచ్ఎస్ అండ్ జేహెచ్ఎస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా సమగ్ర ఆరోగ్య నివేదిక అందుబాటులోకి వస్తుంది. ఈ పథకం ద్వారా జూలై, 2018 నాటికి 2.33 లక్షల మంది ఉద్యోగులు, 6.02 లక్షల డిపెండెంట్లు కలిపి 8.35 లక్షల కార్డులను, అలాగే 1.62 లక్షల మంది పెన్షనర్లు, 1.31 లక్షల మంది వారి డిపెండెంట్లు కలిపి 2.93 లక్షల కార్డులను, సుమారు 2 వేల మంది జర్నలిస్టులు, మరో 5 వేల మంది డిపెండెంట్లు కలిపి మొత్తం 7,500 మందికి ప్రభుత్వం ఈ కార్డులను అందజేసింది.
14. ఏకీకృత సర్వీస్ రూల్స్ కు ప్రభుత్వ ఆమోదం
ఏకీకృత సర్వీసుల రూల్స్ ఫైలుపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై 2016 ఏప్రిల్ 5న ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం పంపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు ప్రధాని నరేంద్ర మోదీ 2017 జూన్ 20న ఆమోదం తెలిపారు. ఫైలుపై సంతకం చేశారు. తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్కు పంపారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్గా ఆర్గనైజ్ చేస్తూ రూపొందించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఫైల్పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017 జూన్ 22న సంతకం చేశారు. దీంతో తెలంగాణ, ఏపీల్లోని పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన సర్వీసు రూల్స్ అమలుకానున్నాయి. ఇకపై పేర్లు వేరుగానే ఉన్నా ఒకే మేనేజ్మెంట్గా పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి సీనియారిటీని వర్తింపజేసేలా ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తెస్తారు. జిల్లా పరిషత్, మున్సిపల్ టీచర్లు, ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న వారందరూ ఒకే గొడుగు కిందకు వస్తారు.
15. ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు పెంపు
ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం వేతనాలను పెంచింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెర్ఫ్ తోపాటు జాతీయ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు పెరిగాయి. సెర్ప్ లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మంది మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్లు వున్నారు. వీరికి రూ. 6,260 నుంచి రూ.12,000 మేర వేతనాలను పెంచారు. మిగతా వారికి 30 శాతం అధికం చేశారు. పెరిగిన జీతాలతో ప్రభుత్వం పై 25.68 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతున్నది. అలాగే ఉపాధి చట్టంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రస్తుతం రూ.6,290 వేతనంగా ఉండగా, ప్రభుత్వం దాన్ని రూ.10,000 చేసింది. మిగతా వారికి 30 శాతం వర్తింపజేసారు. దీంతో మొత్తం 11,415 మందికి జీతాలు పెరిగాయి. ఇందులో 7402 ఫీల్డ్ అసిస్టెంట్లు కాగా, 4013 మంది(30 శాతం) ఎఫ్.టి.ఇ.లు వున్నారు. పెరిగిన జీతాలతో ప్రభుత్వంపై రూ.52.21 కోట్ల భారం పడుతుంది.
వేసవిలో ఉపాధి కూలీలకు ప్రత్యేక భత్యం
వేసవికాలంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు 20 నుంచి 30శాతం వరకు ప్రత్యేక వేసవి భత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా 14 ఫిబ్రవరి 2020న ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
16. 108 సిబ్బంది వేతనాలు పెంపు
అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 1703 మంది 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా 2017 మార్చి 29న ప్రకటించింది. దీనికి సంబంధించిన జి.ఓ.నెం.7 ను 2017 జనవరి 27న జారీ చేసింది. వారి జీతాలను ఒక్కొక్కరికి రూ.4 వేలు పెంచింది. పెరిగిన జీతాలు 2016 ఏప్రిల్ నుండి అందుతున్నాయి. ఆ మొత్తాన్ని (ఎరియర్స్-రూ.8.01 కోట్లు) ఒకేసారి విడుదల చేశారు. 2017 ఏప్రిల్ జీతంతో పాటు ఆ మొత్తాన్ని చెల్లించారు.
ఔట్ సోర్సింగ్ నర్సుల జీతాలు పెంపు
కరోనా కష్టకాలంలో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలను ప్రభుత్వం 10 ఆగస్టు 2020న పెంచింది. దీనితో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని నర్సింగ్, నిమ్స్ దవాఖానల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు రూ.17,500 నుంచి రూ.25,140కు పెరిగాయి. కొవిడ్ విధి నిర్వహణలో సిబ్బంది మరింత చురుకుగా పనిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది.
17. 776 మంది గురుకుల టీచర్ల క్రమబద్ధీకరణ
గురుకుల పాఠశాలల్లో తొమ్మిదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న 758 మంది టీచర్లు, అడ్హాక్ పద్ధతిలో పని చేస్తున్న 18 మంది టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016 మే 4 న జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.
18. భాషా పండితులను, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్
2488 మంది భాషా పండిట్లను,1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని క్యాబినెట్ 2017 ఫిబ్రవరి 2న ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జిఓ నెం.17 మరియు 18ని 2017 ఫిబ్రవరి 3న విడుదల చేశారు.
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హోదాలో పనిచేస్తున్న భాషా పండితులను ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేసింది. వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ)గా పదోన్నతులు పొందారు. వీరి పదోన్నతికి సంబంధించిన లేఖపై 05 ఫిబ్రవరి, 2019న ముఖ్యమంత్రి సంతకం చేశారు. 16 ఫిబ్రవరి, 2019న జీవో నెం.15 ను జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల 8,630 మంది భాషాపండితులు, 1,849 మంది పీఈటీలకు పదోన్నతులు లభించాయి. వీరి జీతం స్కేళ్లను రూ. 28,940-78,910 గా నిర్ణయించారు. గతంలో 2,487 భాషాపండితులు, 1,047 వ్యాయమ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ 03 ఫిబ్రవరి, 2017న జీఓ నెం.17 మరియు 18 ని జారీ చేశారు.
19. ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుకగా హెల్త్ కార్డుల జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రతి కార్పొరేట్ దవాఖానలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి హెల్త్ కార్డులను అందజేశారు. 2018 మే 23 నాటికి 11,99,412 మందికి హెల్త్ కార్డులు జారీ చేశారు.
పెన్షనర్ల కోసం ఫేస్ యాప్
పెన్షనర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటినుంచే లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫేస్ యాప్ ను తీసుకొచ్చింది.
20. రేషన్ డీలర్ల కమిషన్ పెంపు
రేషన్ డీలర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. కిలో బియ్యంపై ఇస్తున్న కమిషన్ను 20 పైసల నుంచి 70 పైసలకు పెంచుతూ 23 ఆగస్టు, 2018 న ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు.
21. వీఆర్ఏల జీతాల శాతం పెంపు
వారసత్వంగా విలేజ్ రెవెన్యూ అసెస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనాలను ప్రభుత్వం 64.61 శాతం పెంచింది. వీఆర్ఏలు పొందుతున్న రూ.6500 వేతనాన్ని రూ.10,500కు పెంచాలని వి.ఆర్.ఏ. ప్రతినిధులతో 2017 ఫిబ్రవరి 24న ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ప్రకటించింది. దీంతో ఒక్కో వీఆర్ఏకు రూ.4,200 వేతనం పెరుగుతుంది. ప్రతినెలా 1వ తేదీన మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నట్లే వీరికి కూడా వేతనం అందుతుంది. గ్రామంలోనే 24 గంటల పాటు అందుబాటులో ఉండి, ప్రజలకు సేవలు చేస్తున్నందున ప్రతీ వారసత్వ వీఆర్ఏకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1నుంచి అమలులోకి వస్తాయి. వీటితోపాటు వీ.ఆర్.ఓ, అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వీ.ఆర్.ఓ.లకు 30 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయనున్నట్లు ప్రకటించింది. వీరిని వెట్టి, మస్కూరి, కావల్ కార్, కాన్దార్ తదితర పేర్లతో పిలుస్తున్నారు. ఇకపై వీరిని అలా పిలవద్దని నిర్ణయించింది. ఏ పని చేసేవారైనా సరే వీ.ఆర్.ఏ. అని మాత్రమే పిలవాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల వారసత్వంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న 19,345 మందికి మేలు కలుగుతుంది.
పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి వీ.ఆర్.ఎ.లుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షరాసి ఉద్యోగం పొందినప్పటికీ తక్కువ వేతనంతో పనిచేస్తున్న 2,900 మంది డెరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలకు మేలు కలుగుతుంది.
22. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వీఓఏ) వేతనంపెంపు
ఉమ్మడి రాష్ట్రంలో అతి తక్కువగా నెలకు రూ.500 నుంచి రూ.1500 వేతనాలతో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వీఓఏ) వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరు చేసేపనికి వస్తున్నజీతం వారికి ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2017 మార్చి 1న ప్రగతి భవన్ లో వీ.ఓ.ఏ.లతో ప్రత్యేకంగా జరిపిన సమావేశంలో వీరి జీతాలు పెంచాలని నిర్ణయించారు. విలేజ్ ఆర్గనైజేషన్స్ అసిస్టెంట్ల (వీవోఏ)కు నెలకు రూ.3వేల గౌరవవేతనం అందజేసేందుకు ప్రభుత్వం 2017 ఆగస్టు 3న ఉత్తర్వులు జారీచేసింది. వీరికి గౌరవ వేతనంతో కలిపి మొత్తం నెలకు రూ.5వేలు అందుతాయి. 2017 ఏప్రిల్ నుంచి తెలంగాణలోని 18,863 మంది వీవోఏలకు పెంచిన వేతనం అందుతున్నది.
23. జలమండలి ఉద్యోగుల వేతన సవరణ
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్, సీవరేజ్ బోర్డు (హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బీ)లో పనిచేస్తున్న4,769 మంది ఉద్యోగులకు వేతనాలు సవరించాలని ప్రభుత్వం 2015 జూలై 12న నిర్ణయించింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తున్నారు.
24. ఎఎన్ఎంలకు వేతనం పెంపు
ప్రత్యేక కమిషన్ ద్వారా 2003 సంవత్సరంలో నియామకమైన 710 మంది ఎఎన్ఎంలకు వేతనాలు పెంచుతూ 2018 ఫిబ్రవరి 4న సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2003లో యూరోపియన్ కమిషన్ పథకం కింద నియామకమైన ఎఎన్ఎంలు తమ వేతనాలుపెంచాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఎఎన్ఎంలకు 10 వేల నుంచి 21 వేలకు వేతనాలను పెంచింది. 2వ ఎఎన్ఎంలకు కూడా త్వరలో వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
25. కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ వేతనాలు పెంపు
రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2010 పిఆర్సి సిఫారసుల మేరకు ఎస్జీటిలకు రూ. 10,900, స్కూల్ అసిస్టెంట్స్కు రూ.14,800 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 1,892 మంది సిఆర్టిలకు మేలు కలుగుతుంది. ప్రతి ఏటా సిఆర్టిలకు వేతనాలకు ప్రభుత్వం 27.22 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
26. మోడల్ స్కూళ్లలో అవర్ బేస్డ్ గా పనిచేస్తున్న వారి వేతనాలు పెంపు
రాష్ట్రంలోని అన్ని మోడల్ స్కూళ్లలో అవర్ బేస్డ్ గా పనిచేస్తున్న వారి వేతనాలను పెంచుతూ ప్రభుత్వం 2017 నవంబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టీచర్లు ఇప్పటి వరకు గంటకు రూ.75 చెల్లిస్తుండగా, పెంచిన ప్రకారం రూ.140 చెల్లించనున్నారు.
27. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని 2016 జనవరి 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి పెంచిన జీతాలను 2016 జనవరి నుండే అమలు చేశారు. ప్రస్తుతం రూ.6,700 జీతం వస్తున్న వాళ్ల వేతనాన్ని రూ.12 వేలకు, 8,400 వస్తున్న వారికి 15 వేలకు, 10,900 వస్తున్న వారి జీతాలను రూ.17 వేలకు పెంచారు. దీంతో ప్రభుత్వం పై అదనంగా రూ.400 నుంచి రూ. 500 కోట్ల భారం పడుతుంది.
28. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల పెంపు
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని 2016 జనవరి 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దాదాపు 25 వేల పైచిలుకు ఉద్యోగులకు లబ్ధి చేకూరేది. కానీ హైకోర్టు నుంచి ఇందుకు వ్యతిరేకంగా తీర్పు వెలుబడింది. ఉద్యోగుల వేతనాలు మాత్రమే పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రం ప్రభుత్వం వీరి వేతనాలు పెంచింది. అలాగే ఏజన్సీలను రద్దుచేసి ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలను అందజేస్తుంది. దీంతో వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించినట్లయింది.
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు 100 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్ పై ముఖ్యమంత్రి 2017 మే 2న సంతకం చేశారు. దీని ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్ల కనీస వేతనం రూ.37,100 కు పెరిగింది. దీనివల్ల రాష్ట్రంలో 3,687 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రయోజనం పొందారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనం రూ.18 వేల నుండి రూ.27వేలకు పెంచుతూ జిఓ ను 2016 డిసెంబర్ 24న విడుదల చేసింది. అప్పుడు 50 శాతం పెంచారు. అనేక విజ్ఞప్తుల మేరకు 100 శాతం వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులర్ టీచర్ల మాదిరిగా వేతనాలు పొందుతున్నారు.
తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారి వేతనాల సవరణ తీరు
ఉద్యోగులు | సంఖ్య | పాత జీతం | ప్రస్తుత జీతం |
ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్లు | 4,174 | 6,260 | 12,000 |
108 సిబ్బంది | 1,703 | (ఒక్కొక్కరికి రూ. 4 వేలు పెంచారు) | |
వీఆర్ఏ | 19,345 | 6,500 | 10,500 |
వీఓఏ | 18,863 | 1,500 | 5,000 |
కాంట్రాక్ట్ రెసి. టీచర్స్ రెసి. స్కూల్ అసిస్టెంట్స్ | 1,892 | 10,900 14,800 | |
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు | 6,700 8,400 10,900 | 12,000 15,000 17,000 | |
కాంట్రాక్ట్ ఉద్యోగులు | |||
కాంట్రాక్ట్ లెక్చరర్లు | 3,687 | 18,000 | 37,100 |
పార్ట్ టైమ్ లెక్చరర్లు | 1,600 | 21,000 | |
అటెండర్స్ | 650 | 3,900 | 7,800 |
నరేగా ఉద్యోగులు | 11,825 | 6,290 | 10,000 |
సెర్ఫ్ | 4,111 | 6,260 | 12,000 |
అంగన్వాడీ కార్యకర్తలు | 4,200 | 10,500 | |
అంగన్ వాడీ హెల్పర్లు | 2,200 | 6,000 | |
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు | 24,000 | 8,500 | 14,000 |
జిహెచ్ఎంసి డ్రైవర్లు | 10,200 | 15,000 | |
ఆశా వర్కర్లు | 27,045 | 1000- 1500 | 6,000 |
అర్చకులు | 5,625 మంది | 8,000 గ్రామాల్లో 10,000 పట్టణాల్లో | |
హెచ్ఎం/వార్డెన్ కు | 5,000 | 21,000 | |
సిఆర్టీలకు | 4000 | 15000 | |
పిఇటిలకు | 4000 | 11000 | |
అకౌంటెంట్ | 3500 | 10000 | |
ఎఎన్ఎంలకు | 4000 | 9000 | |
కుక్స్, ఆయాలు, హెల్పర్ప్, స్వీపర్స్, వాచ్ మెన్ లకు | 2500 | 7500 | |
రేషన్ డీలర్ల కమిషన్ ఒక కిలో బియ్యంపై | రూ.20 పైసలు | రూ.70 పైసలు | |
పంచాయతీ వర్కర్లకు (సఫాయి కర్మచారీలు) | 36,000 మంది | రూ.1వెయ్యి నుంచి రూ.5 వేల వరకు | రూ.8,500 |