న్యూఢిల్లీ : రద్దీగా ఉన్న ట్రైన్ పైకప్పు ఎక్కేందుకు బంగ్లాదేశీ మహిళ ప్రయత్నిస్తున్న వీడియో నెటిజన్లను విస్మయానికి లోను చేసింది. రైలు కిటికీ మీదుగా పైకి ఎక్కేందుకు మహిళ ప్రయత్నిస్తున్న ఈ షాకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. విద్యాధర్ జెనా ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వీడియోను ఎప్పుడు తీశారనే వివరాలు వెల్లడి కాకున్నా రద్దీగా ఉన్న ట్రైన్ పైకి ఎక్కేందుకు మహిళ ప్రయత్నించడం నెటిజన్లలో ఆందోళన రేకెత్తించింది. ఈ వీడియోలో మహిళ కిటికీ పైనుంచి ట్రైన్ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే అక్కడున్న వారు ఆమెకు సాయపడుతున్నారు. ఈలోగా ఆమెను పోలీస్ అడ్డగించడంతో మహిళ ప్రయత్నం విఫలమైంది.
బంగ్లాదేశ్లోని రైల్వే స్టేషన్లో మరో రోజు అన్న క్యాప్షన్తో ఇన్స్టాలో షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకూ 3.68 లక్షల వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. కొందరు యూజర్లు మహిళ భద్రతపై ఆందోళన చెందగా, మరికొందరు బంగ్లాదేశ్లో ఇవన్నీ మామూలేనని లైట్ తీసుకున్నారు.