కోల్కతా: వందేండ్ల వయసులో ఒక వ్యక్తి తన 90 ఏండ్ల భార్యను మళ్లీ పెండ్లి చేసుకున్నాడు. తన వందో పుట్టిన రోజును ఈ మేరకు వినూత్నంగా జరుపుకుని మనవళ్లు, మనుమరాళ్ల కోరికను తీర్చాడు. పశ్చిమ బెంగాల్లోని మారుమూల గ్రామంలో ఈ ఘటన జరిగింది. విశ్వనాథ్ సర్కార్కు సురోధ్వనితో 1953లో వివాహమైంది. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు, 23 మంది మనుమలు, మనుమరాళ్లు, పది మంది మునిమనవళ్లు, మనుమరాళ్లు ఉన్నారు.
కాగా, విశ్వనాథ్ సర్కార్ ఇటీవల వందో ఏట అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డేను వినూత్నంగా జరుపాలని మనవళ్లు, మనుమరాళ్లు భావించారు. దీని కోసం తమకు తోచిన ఐడియాలపై చర్చ జరిపారు. ఆ కుటుంబానికి చెందిన కోడలు గీతా సర్కార్ ఒక ప్రతిపాదన చేశారు. విశ్వనాథ్, సురోధ్వనిలకు మళ్లీ పెండ్లి చేస్తే ఎలా ఉంటుందని అన్నారు. కుటుంబమంతా దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న విశ్వనాథ్ ఆరుగురి సంతానం, వారి 23 మంది పిల్లలు, పది మంది మునిమళ్లు, బంధువులంతా ఆ గ్రామానికి చేరుకున్నారు. 90 ఏండ్ల నానమ్మను రెండు రోజుల ముందే సమీపంలోని బమునియా గ్రామంలోని పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లారు. మనవరాళ్లు ఆమెను పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు.
మరోవైపు వందో ఏట అడుగుపెట్టిన విశ్వనాథ్ సర్కార్ను బుధవారం పెండ్లి కుమారుడిగా మనవళ్లు ముస్తాబు చేశారు. దీంతో ఆయన గుర్రం బండి ఎక్కి ఊరేగుతూ ఐదు కిలోమీటర్ల దూరంలోని వధువు ఇంటికి చేరుకున్నారు. ఆయన అక్కడకు చేరగానే భారీగా పటాకులు పేల్చారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కరెన్సీతో తయారు చేసిన దండలను ఆ వృద్ధ జంట మార్చుకున్నది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. బంధు, మిత్రులతోపాటు గ్రామంలోని ఇరుగు పొరుగువారిని కూడా ఆహ్వానించారు.