జైపూర్: అది రకరకాల వన్య మృగాలుండే ఒక నేషనల్ పార్కు. సోమవారం మధ్యాహ్నం ఆ పార్కు సందర్శకులతో సందడిగా ఉన్నది. కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య టూరిస్టు వాహనాల్లో వచ్చిన సందర్శకులు అక్కడక్కడ తమ వాహనాలను ఆపుకుని జంతువులను చూస్తున్నారు. ఇంతలో ఓ వీధికుక్క వారి వాహనాల దగ్గరికి వచ్చి తచ్చాడటం పార్కులోని సుల్తానా అనే ఆడపులి గమనించింది. అంతే ఒక్కసారిగా టూరిస్టు వాహనాల వైపు దూసుకొచ్చిన పులి అమాంతం ఆ కుక్కపై లంఘించి మెడ అందుకుంది. కుక్కకు అరిచే అవకాశం కూడా ఇవ్వకుండా మెడను కొరికేసింది.
రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి తమవైపు దూసుకురావడం చూసి సందర్శకులు భయంతో వణికిపోయారు. అయితే, అది కుక్క కోసం వచ్చిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు అనీశ్ అంధేరియా వీడియోను ట్విట్టర్లో పోస్టు చేయగా.. కొన్ని గంటల్లోనే 36 వేల మంది చూశారు. ఈ కింది వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి..
Tiger kills dog inside R'bhore. In doing so it is exposing itself to deadly diseases such as canine distemper that can decimate a tiger population in no time. Dogs have emerged as a big threat to wildlife. Their presence inside sanctuaries needs to be controlled @ParveenKaswan pic.twitter.com/t7qDR1MvNl
— Anish Andheria (@anishandheria) December 27, 2021
అయితే, తరచూ నేషనల్ పార్కులోకి చొరబడుతున్న వీధి కుక్కలవల్ల వన్య ప్రాణులకు హానిజరిగే ప్రమాదం ఉన్నదని వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కుక్కల ద్వారా వన్య ప్రాణులకు అనేక జబ్బులు సోకే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా వీధి కుక్కలకు ఉండే వ్యాధులు పులులకు సులువుగా సోకుతాయని, దానివల్ల వ్యాధుల బారినపడి పార్కులోని పులుల జనాభా తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి పార్కులోకి కుక్కలు చొరబడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.