Viral | పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపానికి చేరుకున్నాడు. బంధు, మిత్రులంతా వేడుకకు తరలివచ్చారు. ఈ సమయంలోనే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వధూవరులు పెళ్లి పీటలపై నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వరుడి తండ్రితో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20న రాత్రి మన్సుఖ్పురాలోని కర్కౌలి గ్రామంలో పెళ్లికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేశారు. వరుడు బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా బంధువులతో కలిసి వధువు ఇంటికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో యువతి మైనర్ అంటూ గ్రామస్తుడు ఒకరు మన్సుఖ్పురా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్టేషన్ ఇన్చార్జి గిరీష్కుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
దీంతో పోలీసులను చూడగానే బంధువులంతా ఖంగుతిన్నారు. పోలీసులను చూసిన తర్వాత వధూవరులు భయపడి పీటల మీద నుంచి పొలాల వైపు పారిపోయారు. ఆ తర్వాత బంధువులు సైతం వివాహ వేదిక నుంచి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. వరుడు మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలోని నయాపుర అంబాహ్ అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వరుడి తండ్రి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లో విచారించారు. బాలిక వయసుకు సంబంధించిన పత్రాలతో రావాలని సూచించినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. మైనర్కు వివాహం జరిపించినట్లయితే నిందితులందరిపై చర్యలుంటాయని ఎస్హెచ్ఓ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరుడు గత 15 రోజుల కిందట పొరుగున ఉన్న బంధువులపై వేధింపులకు పాల్పడగా.. కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.