Vardi wale guru | కాలనీ మీటింగ్కు రమ్మని కోరితే.. ఎక్కడ సార్! టైం సరిపోవడం లేదని చాలా మంది జవాబిస్తుండటం మనం చూస్తుంటాం. మనం ఉండే కాలనీ సమస్యలపై అధికారులకు విన్నవించేందుకు చాలా మంది టైం లేదంటూ పక్కకు తప్పుకుంటుంటారు. ఈ పోలీసు అధికారి అలా మాత్రం కాదు. టైం సెట్ చేసుకుని మరీ మురికివాడల చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ‘వర్దీ వాలే గురూజీ’ గా చిన్నారుల మనసుల్లో నిలిచిపోయాడు.
బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి పీజీ చదివిన రంజిత్ యాదవ్ అనే ఈ యువకుడు 2015 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. అయోధ్యలోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అందరిలా ఏమాత్రం ఖాళీ టైం దొరకగానే సినిమాలకో, కుటుంబంతో షికార్లకో వెళ్లి ఎంజాయ్ చేయడు. తమ కార్యాలయానికి సమీపంలోని ఓ చెట్టు నీడలో మురికివాడల చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనో.. వారికి లెక్కలు, సామాన్యశాస్త్రం నేర్పిస్తూనే కాలం వెల్లదీస్తుంటాడు. ఈయన వద్ద చదువు నేర్చుకుంటున్నవారిలో ఎక్కువగా సరయూ నది ఒడ్డున బిక్షమెత్తుకుని జీవించేవారి పిల్లలు ఉంటారు. అప్నా స్కూల్ అని వారు ముద్దుగా పిలుచుకునే ఈ స్కూల్కు చిన్నారులు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే ఉదయాన్నే వస్తారు.
నయాఘాట్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చిన సమయంలో నది వద్ద తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన చేస్తున్న చిన్నారులను చూసి ఓ స్కూల్ మొదలుపెట్టాలని అనుకున్నట్లు రంజిత్ యాదవ్ చెప్పాడు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్కూల్ను మొదలుపెట్టగా ఇప్పుడు దాదాపు 60 మంది చిన్నారులు చదువుకుంటున్నారని తెలిపాడు. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్కూల్ నడుపుతానని, ఉదయాన డ్యూటీ ఉన్న రోజుల్లో పెద్ద పిల్లాడికి బాధ్యతలు అప్పగిస్తానని పేర్కొన్నాడు. తన యజ్ఞానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు తోడ్పాటునందిస్తున్నారని, వారి సాయం వల్ల పిల్లలకు పుస్తకాలు, నోట్బుక్స్ ఇచ్చి చదువు చెప్తున్నట్లు వెల్లడించాడు. చదువు ప్రాధాన్యత గురించి చెప్తూ వివిధ స్ఫూర్తిదాతల వీడియోలను మొబైల్ ఫోన్లో చూపించి వారిని ప్రోత్సహిస్తున్నట్లు రంజిత్ యాదవ్ తెలిపాడు.