లక్నో: ఇద్దరు మహిళ మధ్య ఉన్న సాన్నిహిత్య సంబంధాన్ని వారి కుటుంబాలు వ్యతిరేకించాయి. వారిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించడాన్ని తప్పుపట్టాయి. దీంతో కుటుంబాల నుంచి, సామాజికంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఒక మహిళ మగవాడిగా మారేందుకు సిద్ధమైంది. దీని కోసం లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటున్నది. ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన జరిగింది. లెస్బియన్స్ అయిన ఇద్దరు మహిళలు జీవిత భాగస్వాములుగా జీవితాంతం కలిసి ఉండాలని భావించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఇద్దరు మహిళల కుటుంబాలు వ్యతిరేకించాయి. తమ కుటుంబాలకు నచ్చజెప్పేందుకు వారిద్దరూ ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా, తమ మధ్య సంబంధానికి ఎవరి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఒక మహిళ మగవాడిగా మారాలని నిర్ణయించుకుంది. లింగ మార్పిడి శస్త్ర చికిత్స కోసం ప్రయోగరాజ్లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్ను సంప్రదించింది. దీంతో అక్కడి వైద్యులు లింగ మార్పిడికి సంబంధించిన ఆరు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఏడాదిన్నర వ్యవధిలో ఆ మహిళ పూర్తిగా మగవాడిగా మారుతుందని డా. మోహిత్ జైన్ తెలిపారు. 18 నెలల రికార్డు టైమ్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. లింగ మార్పిడి చేయించుకుంటున్న మహిళ పూర్తి ఆరోగ్యంతో ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వెల్లడించారు.