బెంగళూరు: ఒక స్కూల్ ప్రాంగణమంతా ‘సారీ’ అంటూ పెద్దగా రెడ్ పెయింట్తో రాశారు. స్థానికులతోపాటు పోలీసుల దృష్టిని ఇది ఆకట్టుకుంది. ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ ‘క్షమించు’ అంటూ స్కూల్ ప్రాంగణంతోపాటు సమీపంలోని వీధుల్లో రాసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. సుంకడకట్టే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ స్కూలు మెట్లు, ప్రాంగణంతోపాటు పరిసర వీధుల్లో ఇంగ్లీష్లో ‘సారీ’ అంటూ పెద్దగా ఎర్రటి రంగుతో రాశారు. బుధవారం ఉదయం ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎవరు, ఎవరికి ఎందుకు ‘సారీ’ చెప్పారో అన్నది ఎవరికీ అర్థం కాలేదు.
మరోవైపు ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇది రాసిన వారిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫుడ్ డెలివరీ బ్యాగ్లో పెయింట్స్ తెచ్చి ఆ ప్రాంతమంతా ఇలా ఇంగ్లీష్లో ‘సారీ’ అని రాసినట్లు గుర్తించారు. అయితే ఆ వ్యక్తులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. వారి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు పశ్చిమ బెంగళూరు డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు. దీనిపై ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.