తిరువనంతపురం: రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. దీంతో ఆ రైలును స్టేషన్లో నిలిపి పాములు పట్టుకునేవారితో వెతికించారు. అయితే పాము కనిపించకపోవడంతో ఆ రైలు ముందుకు సాగింది. కేరళలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్ 5 కంపార్ట్మెంట్లో పాము కనిపించింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలు తిరుర్ స్టేషన్ దాటిన తర్వాత బెర్త్ కింద ఉన్న లగేజ్ వద్ద పాము కనిపించిందని ప్రయాణికులు టీటీఈకి ఫిర్యాదు చేశారు. మొబైల్లో తీసిన పాము ఫొటో కూడా చూపించారు.
కాగా, సమాచారం అందుకున్న కోజికోడ్ రైల్వే స్టేషన్ అధికారులు రాత్రి 10.15 గంటలకు రైలును ఆ స్టేషన్లో నిలిపివేశారు. ఎస్ 5 కంపార్ట్మెంట్లోని ప్రయాణికులందరిని ఖాళీ చేయించారు. అటవీ శాఖకు చెందిన పాములు పట్టే ఇద్దరు వ్యక్తులను రప్పించి వెతికించారు.
అయితే గంటకుపైగా వెతికినప్పటికీ ఆ పాము కనిపించలేదు. పాము ఫొటోను చూసిన సిబ్బంది అది అంత ప్రమాదం కాదని తెలిపారు. కంపార్ట్లోని హోల్ ద్వారా అది వెళ్లిపోయి ఉండవచ్చు లేదా అక్కడ దాగి ఉండవచ్చని అన్నారు. దీంతో ఆ హోల్ను మూసివేశారు. అనంతరం అర్ధ రాత్రి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది.