Rajasthan : దేవుళ్లను ఆరాధించడం, కష్ట సమయంలో వాళ్లను తలచుకోవడం అందరూ చేసేదే. అయితే, కొందరు దేవుళ్లపై అమితమైన ప్రేమ పెంచుకుంటారు. అందుకు మీరాబాయి ఒక ఉదాహరణ. కృష్ణ భగవానుడిపై అమితమైన ప్రేమ పెంచుకున్న ఆమె చివరకు అతడిని పెళ్లి చేసుకుంది. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. రాజస్థాన్లోని జైపూర్లో30 ఏళ్ల యువతి మహా విష్ణువును పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 8వ తేదీన సంప్రదాయ పద్ధతిలో ఆమె విష్ణువును పెళ్లాడింది. ఆమె నిర్ణయం వెనక కారణం తెలిసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకు ఆమె ఏం చెప్పిందంటే… ‘చిన్న చిన్న విషయాలకే భార్యభర్తలు గొడవపడడం చూశాను. గొడవల కారణంగా వాళ్ల జీవితాలు నాశనం కావడం గమనించాను. అయితే.. ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఆడవాళ్లే. అందుకనే నేను విష్ణువును పెళ్లి చేసుకోవాలనుకున్నా’ అని చెప్పింది. ఆ యువతి పేరు పూజా సింగ్. ఆమెది జైపూర్లోని నర్సింఘ్పూర్ గ్రామం.
పూజ పొలిటికల్ సైన్స్లో పీజీ చేసింది. పెళ్లి చేసుకున్న ఇరుగు పొరుగు, కుటుంబ సభ్యలు గొడవ పడడం గమనించేది. దాంతో ఈ ఇబ్బందులేవీ తను పడొద్దు అనుకుంది. అందుకని దేవుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే.. ఆమె తండ్రి ఒప్పుకోలేదు. కానీ, ఆమె తల్లి రతన్ కన్వర్ పూజకు మద్దతు నిలిచింది. 300 మంది బంధువుల సమక్షంలో విష్ణువుతో ఆమె పెళ్లి జరిపించింది. దాంతో, పూజ ఇంట్లోనే విష్ణువు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజలు చేస్తూ గడపనుంది.