అహ్మదాబాద్: ఒక వివాహితుడు ప్రేమించిన మహిళను తన వెంట తీసుకుపోయాడు. దీంతో ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించాడు. పోలీసులు పలు నెలల శ్రమించి వారిని వెతికారు. చివరకు ఆ జంటను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో వెతికేందుకు పోలీసులకు అయిన ఖర్చుల్లో 50 శాతం చెల్లించాలని ఆ వివాహితుడ్ని కోర్టు ఆదేశించింది. ఆసక్తికరమైన ఈ ఘటన గుజరాత్లో జరిగింది. అప్పటికే పెళ్లి అయిన రాఘభాయ్ పర్మార్, రాజ్కోట్కు చెందిన 20 ఏళ్ల యువతితో 2021 మేలో పారిపోయాడు. దీంతో ఆ మహిళ తండ్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టు జోక్యంతో రాజ్కోట్ పోలీసులు ఆ జంటను వెతికారు. ఏడు నెలలు శ్రమించి ఎట్టకేలకు వారి ఆచూకీని గుర్తించారు. చివరకు వారిని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అయితే ఆ జంటను వెతికేందుకు తాము 17,710 గంటలు శ్రమించామని, చాలా ఖర్చులయ్యాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. మహిళ ఆచూకీని గుర్తించేందుకు దర్యాప్తు కోసం రూ.42,500, ఏడు నెలల దర్యాప్తు కాలంలో ఇతర ఖర్చులతోపాటు వారిని తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చేందుకు రూ.75,000 కలిపి మొత్తం రూ.1,17,500 ఖర్చు చేసినట్లు చెప్పారు.
దీంతో హైకోర్టు ఈ నెల 19న విలక్షణమైన తీర్పు ఇచ్చింది. ఆ మహిళను వెతికేందుకు పోలీసులకు అయిన ఖర్చుల్లో సగమైన రూ.55,000లు కోర్టుకు చెల్లించాలని వివాహిత వ్యక్తిని ఆదేశించింది. పోలీసులకు అయిన మొత్తం ఖర్చులను వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ సగం మొత్తాన్ని ఆ వ్యక్తి భరించడం భావ్యంగా కోర్టు భావించినట్లు తెలిపింది. ఆ మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీకి చెల్లించాలని ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ వ్యక్తి చెల్లించిన డబ్బును రాజ్కోట్ నగర పోలీస్ వెల్ఫేర్ ఫండ్కు బదిలీ చేయాలని కోర్టు రిజిస్ట్రీకి సూచించింది.