వాయనాడ్: ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా ఏదైనా ప్రోడక్ట్ కోసం ఆర్డర్ చేసినప్పుడు ఒకదానికి బదులుగా మరో వస్తువు రావడం అసాధారమైన విషయం ఏమీ కాదు. గత ఏడాది అక్టోబర్లో కేరళలోని అళువా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమెజాన్లో ఐఫోన్ 12 కోసం ఆర్డర్ చేశాడు. కానీ ఆర్డర్ అందుకోగానే అతనికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అతనికి ఇచ్చిన పార్శిల్లో ఐఫోన్ లేదు. దానికి బదులుగా గిన్నెలు తోముకునే సబ్బు, ఒక ఐదు రూపాయల బిళ్ల ఉన్నాయి.
తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వాయనాడ్ జిల్లా కనియంబెట్ట గ్రామానికి చెందిన మితున్ బాబు ఇటీవల అమెజాన్లో పాస్పోర్ట్ కవర్ కోసం ఆర్డర్ చేశాడు. కానీ, అతనికి పాస్పోర్ట్ కవర్తోపాటే ఏకంగా పాస్పోర్టు కూడా వచ్చింది. అక్టోబర్ 30న మితున్ బాబు ఆర్డర్ చేయగా.. నవంబర్ 1న ప్రోడక్ట్ అందింది. అతను పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో పాస్పోర్ట్ కవర్తోపాటు ఒరిజినల్ పాస్పోర్టు కూడా ఉంది.
దాంతో మితున్ వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్కు కాల్ చేయగా.. వాళ్లు చెప్పిన సమాధానం విస్మయానికి గురిచేసింది. మరోసారి ఇలాంటివి జరుగకుండా చూసుకుంటాం. ఇంకోసారి జాగ్రత్తగా ఉండాలని సెల్లర్కు కూడా సూచిస్తాం అని చెప్పారు. కానీ తనకు పార్శిల్లో వచ్చిన ఒరిజినల్ పాస్ట్పోర్టును ఏం చేయాలనే విషయం మాత్రం చెప్పలేదు. మితున్ పాస్పోర్ట్ను పరిశీలించి చూడగా అది త్రిస్సూర్ జిల్లాకు చెందిన మహ్మద్ సాలిహ్ పేరు మీద ఉంది. అతనికి ఫోన్ చేసి చెబుదామంటే పాస్పోర్ట్పై ఫోన్ నంబర్ లేదు.
కానీ, మితున్ బాబు విశ్వ ప్రయత్నాలు చేసి మహ్మద్ సలీహ్ జాడ కనిపెట్టి.. అతని పాస్పోర్ట్ అతనికి పంపించాడు. తనకంటే ముందుగా మహ్మద్ సలీహ్ పాస్పార్ట్ కవర్ కోసం ఆర్డర్ చేసి ఉంటాడని, ఆర్డర్ రాగానే ఆ కవర్లో తన పాస్పోర్టు పెట్టి చెక్ చేసుకుని ఉంటాడని, అది నచ్చకపోవడంతో పాస్పోర్ట్ తీయడం మర్చిపోయి అలాగే రిటర్న్ చేసి ఉంటాడని మితున్ బాబు అంచనా వేశాడు. రిటర్న్ వచ్చిన పాస్పోర్టును సెల్లర్ సరిగా తనిఖీ చేయకపోవడంతో ఆ పాస్పోర్టు తనదాకా వచ్చి ఉంటుందన్నాడు.